కరోనా మహమ్మారి విజృంభించి ఏడాది గడిచినా వైరస్ గురించి భయాందోళన ప్రజల్లో ఏ మాత్రం తగ్గలేదు. గతంలో ఏ వైరస్ వ్యాప్తి చెందని విధంగా కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందడంతో పాటు ప్రజలకు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు కరోనా మహమ్మారికి చెక్ పెట్టే మందులు, వ్యాక్సిన్ల కోసం పరిశోధనలను కొనసాగిస్తున్నారు. వీలైనంత త్వరగా ప్రజలకు వ్యాక్సిన్ ను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.

అయితే వ్యాక్సిన్ వచ్చినా రాకపోయినా తగిన జాగ్రత్తలు తీసుకుంటే మాత్రమే ఈ వైరస్ కు చెక్ పెట్టడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆరోగ్యంగా ఉన్నవారు కరోనా సోకితే త్వరగానే కోలుకుంటున్నా దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలతో బాధ పడే వాళ్లు మాత్రం కరోనా నెగిటివ్ వచ్చిన తరువాత కూడా ఇతర ఆరోగ్య సమస్యలతో బాధ పడుతూ ఉండటం గమనార్హం.
అమెరికాకు చెందిన గీసిన్జర్ మెడికల్ కాలేజీ తాజాగా కరోనా గురించి ఒక పరిశోధన చేసి షాకింగ్ విషయాలను వెల్లడించింది. మార్చి నెల 7వ తేదీ నుంచి మే నెల 19వ తేదీ వరకు కిడ్నీ రోగులపై కరోనా ప్రభావం గురించి పరిశోధనలు చేసి కిడ్నీ వ్యాధులతో బాధ పడేవాళ్లపై కరోనా వైరస్ తీవ్రంగా ప్రబావం చూపే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
గీసిన్జర్ మెడికల్ కాలేజీ వైద్యులు సాధారణ రోగులతో పోల్చి చూస్తే కిడ్నీ సమస్యలతో బాధ పడే వాళ్లు 11 రెట్లు ఎక్కువగా కరోనా బారిన పడే అవకాశం ఉందని తేల్చారు. ఇతర దీర్ఘకాలిక వ్యాధులతో పోల్చి చూస్తే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధ పడేవారిపై వైరస్ ప్రభావం ఎక్కువగా ఉందని శాస్త్రవేత్తలు వెల్లడించడం గమనార్హం.





























