పది వేలు కడితే ఇరవై వేల రూపాయలు.. ఎక్కడంటే..?

ఈ మధ్య కాలంలో మోసాలు చేయడానికి మోసగాళ్లు ఎక్కువగా ప్రజల బలహీనతలను క్యాష్ చేసుకుంటున్నారు. డబ్బును ఆశ చూపి అమాయక ప్రజలను ఈ నిలువునా ముంచేస్తున్నారు. మాటలతో గారడీ చేస్తూ కోట్ల రూపాయలు దోచేస్తున్నారు. స్కీముల పేరుతో కొత్త తరహా స్కాములకు తెరలేపుతున్నారు. లక్ష కాదు రెండు లక్షలు కాదు ఏకంగా కోట్ల రూపాయలు వసూలు చేస్తూ అమాయకపు ప్రజలను పిచ్చోళ్లను చేస్తున్నారు.

ఏపీలో నెల్లూరు జిల్లాలో కొత్త తరహా మోసం వెలుగులోకి వచ్చింది. ఆన్ లైన్ ట్రేడింగ్ ద్వారా 84 కోట్ల రూపాయలు వసూలు చేసిన ఒక ముఠాను పోలీసులు పట్టుకున్నారు. నెల్లూరు ఎస్పీ భాస్కర్ భూషణ్ మీడియాతో మాట్లాడుతూ ముఠాకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన కొందరు యువకులు ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో వెల్‌ పే ట్రేడర్స్‌ పేరుతో సంస్థను ప్రారంభించారు.

ప్రజలకు 10,000 రూపాయలు డిపాజిట్ చేస్తే 100 పనిదినాల్లో రోజుకు 200 రూపాయల చొప్పున ఆన్ లైన్ లో 20,000 రూపాయలు జమ చేస్తామని ప్రకటనలు ఇచ్చారు. సులభంగా డబ్బు సంపాదించవచ్చనే ఆశతో చాలామంది తమ కష్టార్జితాన్ని డిపాజిట్ చేశారు. ఒకరు కాదు ఇద్దరు ఏకంగా ఏపీకి చెందిన 12,600 మంది ఈ మోసానికి బలయ్యారు. అలా మోసపోయిన వారిలో కొందరు బాధితులు నెల్లూరు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

ఇన్‌స్పెక్టర్‌ నాగేశ్వరమ్మ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను పట్టుకోవడం కోసం అధికారులు ప్రత్యేక బృందాలను నియమించాయి. ఈ బృందాలు కేసులో ప్రధాన నిందితులైన రవికుమార్, శ్రీను, సుమన్ లను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు మనీ స్కీంల పేర్లు చెప్పి మోసాలకు పాల్పడే వారి విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.