దారుణం: ప్రేమించుకున్నారు పెళ్లి చేసుకోవాలంటే కుటుంబ పెద్దలు ఒప్పుకోలేదు… చివరికి ఇలా చేశారు?

ప్రేమ ఎప్పుడు ఎవరి జీవితంలో ఎలా పుడుతుందో ఎవరికీ తెలియదు. ఒకసారి ప్రేమ పుడితే ప్రేమ కోసం ఎంతటి సాహసానికైనా వెనుకాడరు. ఈ విధంగా ప్రేమించుకున్న ఓ జంట పెళ్లి చేసుకోవాలని ఇరు కుటుంబాల పెద్దలకు తమ ప్రేమ విషయాన్ని చెప్పారు. అయితే వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం తెలుపక పోవడంతో ప్రేమలో ఓడిపోయిన వీరు చావులో నైనా కలిసే చనిపోవాలని భావించారు. ఈ క్రమంలోనే ఇద్దరు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేసుకోగా యువతి మరణించి యువకుడు ప్రాణాపాయ స్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఘటన కామారెడ్డి జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కామారెడ్డి జిల్లా లింగంపేట మండలం ఐలాపూర్ గ్రామానికి చెందిన నీర‌డి రాజు పదవ తరగతి వరకు చదివి 2 సంవత్సరాల క్రితం దుబాయ్ వెళ్ళాడు. అయితే కరోనా సమయంలో తిరిగి సొంత గ్రామానికి వచ్చిన రాజు అదే గ్రామానికి చెందిన మాధవి అనే యువతితో ప్రేమలో పడ్డాడు.సంవత్సరంపాటు ప్రేమించుకుంటున్న ఈ జంట పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకోవాలని ఎంతో ధైర్యంగా వారి పెద్దలకు ప్రేమ విషయాన్ని చెప్పారు.

వీరి పెళ్లికి పెద్దలు అంగీకారం చెప్పకపోవడంతో పెళ్లి ద్వారా జీవితంలో ఒకటి కాలేని వీరు చావులోనైనా కలిసి చనిపోవాలనే కఠిన నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ క్రమంలోనే గత నెల 30వ తేదీన గ్రామ శివారులో పంట పొలంలోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశారు.ఈ విధంగా అపస్మారక స్థితిలో ఉన్న వీరిని చూసిన స్థానికులు ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో చికిత్స నిమిత్తం వీరిని హైదరాబాద్ గాంధీ ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి వెళ్లేలోగా మాధవి మృతి చెందడంతో ప్రాణాపాయ స్థితిలో రాజు చికిత్స పొందుతున్నారు.రాజు పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ మేరకే మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.