Tag Archives: engineering students

జేఎన్‌టీయూహెచ్‌ కీలక నిర్ణయం.. ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త..?

భారత్ లో శరవేగంగా విజృంభిస్తోన్న కరోనా మహమ్మారి విద్యా రంగంపై తీవ్ర ప్రభావం చూపిన సంగతి తెలిసిందే. వైరస్ విజృంభణ వల్ల చాలా రాష్ట్రాలలో నేటికీ పాఠశాలలు, కాలేజీలు తెరుచుకోలేదు. ఇప్పటికే పాఠశాలలను తెరిచిన రాష్ట్రాల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు కరోనా బారిన పడుతూ ఉండటం అధికారులు, రాష్ట్ర ప్రభుత్వాలను టెన్షన్ పెడుతోంది. వైరస్ వ్యాప్తి నేపథ్యంలో జేఎన్‌టీయూహెచ్‌ ఇంజనీరింగ్ విద్యార్థులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది.

నిబంధనల్లో కీలక మార్పులు చేసి జేఎన్‌టీయూహెచ్‌ విద్యార్థులకు ప్రయోజనం కలిగేలా చేసింది. క్రెడిట్ల విషయంలో, డిస్టింక్షన్ విషయంలో మార్పులు చేసింది. సాధారణంగా జేఎన్‌టీయూహెచ్‌ లో 192 క్రెడిట్లు సాధించిన విద్యార్థులను మాత్రమే పాస్ అయినట్లుగా పరిగణిస్తారు. అయితే ప్రస్తుతం క్రెడిట్లను ప్రస్తుతం 192 నుంచి 186కు తగ్గించారు. దీంతో క్రెడిట్లు తక్కువగా ఉన్నా ఇకపై పాస్ అయినట్లుగా జేఎన్‌టీయూహెచ్‌ పరిగణిస్తోంది.

సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన వారికి గతంలోలా కాకుండా రెగ్యులర్ గానే పాసైనట్లు గుర్తించాలని జేఎన్‌టీయూహెచ్‌ భావిస్తోంది. విద్యార్థులు కరోనా వల్ల పనిదినాలను నష్టపోయిన నేపథ్యంలో పలు యూనివర్సిటీలు సిలబస్ లో కీలక మార్పులు చేసి గతంలోలా కాకుండా విద్యార్థులపై ఒత్తిడిని తగ్గించే దిశగా అడుగులు వేస్తున్నాయి. ఈ నిర్ణయం వల్ల విద్యార్థులపై సిలబస్ భారం తగ్గనుంది.

అఖిల భారత సాంకేతిక విద్యామండలి (ఏఐసీటీఈ) వచ్చే నెల ఒకటో తేదీ నుంచి ఇంజనీరింగ్ ఫస్టియర్ తరగతులను ప్రారంభించనుంది. ఇప్పటికే ఈ మేరకు ఏఐసీటీఈ నుంచి అకడమిక్ క్యాలెండర్ విడుదలైంది.

ఇంజనీరింగ్ విద్యార్థులకు శుభవార్త.. రూ. 42,000 వేతనంతో ఉద్యోగాలు..?

గత కొన్ని రోజుల నుంచి నిరుద్యోగులకు వరుసగా ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్లు విడుదలవుతున్న సంగతి తెలిసిందే. కేంద్ర గృహ, ప‌ట్ట‌ణ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన ఎన్‌బీసీసీ సంస్థ కాంట్రాక్ట్ ప్రాతిపదికన 100 ఇంజినీర్‌ ఉద్యోగాల భర్తీకి సిద్ధమైంది. ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ఎన్‌బీసీసీ (ఇండియా) నిరుద్యోగ అభ్యర్థులు ఆన్ లైన్ తో పాటు ఆఫ్ లైన్ లో దరఖాస్తు చేసుకునే అవకాశం కల్పిస్తోంది.

ఈ ఉద్యోగాలకు రాత పరీక్ష, గ్రూప్‌ డిస్క‌ష‌న్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ జరుగుతుంది. https://www.nbccindia.com/ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. మొత్తం 100 ఇంజనీర్ ఉద్యోగాలకు ఖాళీలు ఉండగా వాటిలో 80 సివిల్ ఇంజనీర్ ఉద్యోగాలు, 20 మెకానికల్ ఉద్యోగాలు ఉన్నాయి.

బీఈ/ బీటెక్ ఉత్తీర్ణ‌త‌తో పాటు అనుభవం ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. 35 సంవత్సరాల లోపు వయస్సు ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగాలకు అర్హులు, ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసేవాళ్లు 550 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు డిసెంబర్ 15వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఉద్యోగాలకు 42,000 రూపాయలు వేతనంగా చెల్లిస్తారు.

వరుసగా వెలువడుతున్న నోటిఫికేషన్ల వల్ల నిరుద్యోగ అభ్యర్థులకు ప్రయోజనం చేకూరుతుంది. కరోనా వల్ల ఉద్యోగాలు కోల్పోయిన అభ్యర్థులు, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్లు కష్టపడి ప్రయత్నిస్తే సులువుగా ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపిక కావడం సాధ్యమే.