Tag Archives: Olympics 2021

మీ సైన్యంలో మేమంతా భాగమే.. బాహుబలి.. వైరల్ గా మారిన ఆనంద్ మహీంద్రా ట్వీట్..

భారతదేశం తరఫున టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రాపై దేశం నలుమూలల నుంచి ప్రశంసల వర్షం కురుస్తోంది. అతడికి బహుమతులు, విరాళాలు కొకొల్లలుగా వచ్చి పడుతున్నాయి. జావెలిన్‌ త్రో ఫైనల్లో భాగంగా అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన నీరజ్‌ చోప్రా స్వర్ణం గెలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే.

ఆ క్షణం నుంచి అతడిని భారత హీరోగా ప్రతీ ఒక్కరు అభివర్ణిస్తున్నారు. అతడు స్వర్ణం గెలిచిన వెంటనే బీసీసీఐ రూ.కోటి నజరానా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్‌ మహీంద్ర నీరజ్ చోప్రాను బాహుబలి అంటూ పొగడ్తలతో ముంచెత్తాడు. స్వర్ణం గెలవడంతో భారతదేశంలోని ప్రతీ పౌరుడి గుండెల్లో నిలిచిపోయావని ఆయన ప్రశంసించారు. అయితే ట్విట్టర్ వేదికగా ఓ నెటిజన్ ఇలా ట్వీట్ చేశారు.

తేష్‌ జైన్‌ అనే ట్విటర్‌ యూజర్‌ నీరజ్‌ చోప్రాకు మహీంద్ర కంపెనీ త్వరలో లాంచ్‌ చేయనున్న ఎస్‌యూవీ శ్రేణికి చెందిన ఎక్స్‌యూవీని ఇవ్వాలిసిందిగా అభ్యర్థించాడు. ఆ భ్యర్థనను అంగీకరించిన ఆనంద్ మహీంద్రా తప్పకుండా తాను దీనిని అంగీకరిస్తున్నానని అతడికి ఎక్స్‌యూవీని ఇచ్చే ఏర్పాట్లు చేస్తానని చెప్పాడు. ఎక్స్‌యూవీ బహుమతిగా ఇవ్వడం తనకు వ్యక్తిగతంగా ఎంతో ప్రత్యేకం మాత్రమే కాకుండా.. ఎంతో గౌరవం అంటూ రిప్లై ఇచ్చారు.

అంతేకాకుండా తామంతా మీ ఆర్మీలో భాగమే.. బాహుబలి అంటూ నీరజ్‌ చోప్రాను ఉద్దేశించి ట్వీట్‌ చేశారు. ఆ ట్వీట్ కు తోడు నీరజ్ జావెలిన్ ని విసిరే ఫోటోతో పాటు బాహుబలి చిత్రంలోని యుద్ద సమయంలో ప్రభాస్ ఉన్న ఫొటోని షేర్ చేశారు. ఇప్పుడు ఆ ట్వీట్ మరియు ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.