దేశంలో ఈ మధ్య కాలంలో సైబర్ మోసాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమాయకులను టార్గెట్ చేసి సైబర్ మోసగాళ్లు ఈ మోసాలకు పాల్పడుతూ ఉండటం గమనార్హం. తాజాగా మహారాష్ట్రలో ఒక యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడం వల్ల బ్యాంక్ ఖాతాలో 9 లక్షల రూపాయలు మాయమయ్యాయి. చేసిన చిన్న తప్పు వల్ల ఒక కుటుంబం బ్యాంక్ ఖాతాలోని నగదునంతా కోల్పోయి బాధ పడుతోంది.
పూర్తి వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని నాగపూర్ సమీపంలో అశోక్ మన్వతే నివశించేవారు. వృత్తిరిత్యా చిన్న వ్యాపారం చేసేవారు. అతని కొడుకు తరచూ అశోక్ ఫోన్ ను వినియోగించేవారు. అలా వినియోగిస్తున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి నుంచి అతనికి ఫోన్ వచ్చింది. అవతలి వ్యక్తి తాను కస్టమర్ కేర్ నుంచి కాల్ చేస్తున్నానని పరిచయం చేసుకుని తన తండ్రి బ్యాంక్ ఖాతాలు ఫోన్ కు లింక్ అయినట్టు చెప్పాడు.
తాము క్రెడిట్ పరిమితిని పెంచుతామని అందుకోసం ఒక యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాల్సి ఉంటుందని కస్టమర్ కేర్ ప్రతినిధిగా పరిచయం చేసుకున్న వ్యక్తి చెప్పాడు. అతని మాటలను నిజమేనని నమ్మిన బాలుడు చెప్పిన ప్రకారం యాప్ ను ఇన్ స్టాల్ చేసుకున్నాడు. అనంతరం సాఫ్ట్ వేర్ సహాయంతో బాలుడి మొబైల్ ఫోన్ ను యాక్సెస్ చేసి ఖాతాలోని నగదు మాయం చేశాడు.
బాలుడు డౌన్ లోడ్ చేసుకున్న యాప్ రిమోట్ డెస్క్ టాప్ యాప్ అని సమాచారం. సైబర్ క్రైమ్ పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రిమోట్ డెస్క్ టాప్ యాప్ ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని పోలీసులు ప్రజలకు సూచిస్తున్నారు.