కరోనా ఉన్నా పెళ్లి చేశారు.. ఊరంతా రెడ్ జోన్.. ఎక్కడంటే?

దేశవ్యాప్తంగా కరోనా రెండోదశ తీవ్రంగా ఉంది. మొదటి దశ కంటే రెండవ దశలో ఎక్కువగా యువత ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. కరోనా బారిన పడినవారు తగినన్ని జాగ్రత్తలు పాటించకపోవడమే కాకుండా వారి ఇష్టానుసారంగా తిరుగుతూ ఉండటం వల్ల వైరస్ వ్యాప్తి అధికంగా జరుగుతుంది.

తాజాగా ఇలాంటి నిర్లక్ష్యం వల్లే ఓ యువకుడు వల్ల ఏకంగా ఒక గ్రామం మొత్తం రెడ్ జోన్ లోకి వెళ్ళింది. మధ్యప్రదేశ్ లుహుర్‌గువా అనే గ్రామానికి చెందిన అరుణ్ మిశ్రా అనే యువకుడికి ఏప్రిల్ 27 న కరోనా పాజిటివ్ అని నిర్ధారణ జరిగింది. అయితే ఆ యువకుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకుండా ఇద్దరు స్నేహితులతో కలిసి ఒక వివాహానికి హాజరయ్యారు. వివాహానికి వెళ్లిన వ్యక్తి ఒక మూలన కూర్చుని ఉండకుండా పెళ్లికి వచ్చిన అతిథులకు విందుతోపాటు కరోనాను కూడా వడ్డించాడు.

పెళ్లికి వచ్చిన అతిథులకు అరుణ్ మిశ్రాకి కోవిడ్ అనే విషయం తెలియక అతిథులు అందరూ భోజనాలు చేశారు.అదేవిధంగా పెళ్లిలో నిర్వహించిన సంగీత కార్యక్రమంలో కూడా అందరితో కలిసి డాన్సులు వేశాడు. పెళ్ళి తంతు ముగిసిన తర్వాత లుహుర్‌గువా గ్రామంలో ఒక్కసారిగా కేసులు పెరిగాయి. ఉన్నపళంగా కేసులు పెరగడానికి కారణం ఏమిటని అధికారులు ఆరా తీస్తే అసలు విషయం బయటపడింది.

ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన పోలీసులు అతనిపై, ఇద్దరు స్నేహితుల పై కేసు నమోదు చేశారు. గ్రామంలో 40 మందికి పాజిటివ్ రావడంతో ఆ గ్రామం మొత్తాన్ని రెడ్ జోన్ గా పరిగణించారు. అదేవిధంగా పెళ్లికి అధికారుల నుంచి ఎటువంటి అనుమతి తీసుకోలేదని,పాజిటివ్‌గా వచ్చిన అరుణ్ మిశ్రాను క్యారంటైన్‌కు తరలించలేదని, కనీసం వారి ఇంటి ముందు ఎటువంటి నోటీసులు అంటించడం లేదని స్థానికులు తెలియజేశారు.