బిగ్ బాస్ కంటెస్టెంట్లపై గంగవ్వ సంచలన వ్యాఖ్యలు..!

బుల్లితెర బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ లో ఈ సీజన్ లో అందరికంటే ప్రేక్షకులను ఎక్కువగా ఆకర్షించిన కంటెస్టెంట్ ఎవరైనా ఉన్నారా..? అంటే ఆమె గంగవ్వే అని చెప్పాలి. మొదటి వారం బిగ్ బాస్ హౌస్ లో బాగానే ఉన్న గంగవ్వ రెండో వారమే తనకు ఇంటి బెంగ పట్టుకుందని.. ఆరోగ్యం బాగోలేదని బాధ పడ్డారు. ఆ తర్వాత మళ్లీ యాక్టివ్ అయిన గంగవ్వ అనారోగ్యం బారిన పడి ఇంటి నుంచి వెళ్లిపోతానని చెప్పడంతో ఆమెను బిగ్ బాస్ హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు.

బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన గంగవ్వ హౌస్ మేట్స్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచారు. ఇంట్లో అందరికంటే అవినాష్ బాగా నవ్విస్తాడని, అఖిల్ మోనాల్ జంట బాగుంటుందని, అఖిల్ తో ఉండటం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు. బిగ్ బాస్ హౌస్ లో అందరి కంటే సొహైల్ కు కోపం ఎక్కువని వెల్లడించారు. బిగ్ బాస్ హౌస్ లో హారికకు ఉండే అర్హత లేదని ఎప్పుడూ కోపంగా తన లోకంలో తనే ఉంటుందని అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో కుమార్ సాయి ఫేక్ గా ఉండడని ఆట చాలా జెన్యూన్ గా ఆడతాడని గంగవ్వ చెప్పారు. అఖిల్ తన కాళ్లు ఒత్తినంత మాత్రాన అతడిని మంచోడని చెప్పలేనని గంగవ్వ్ అన్నారు. అఖిల్ మంచోడు కాకపోయినా మంచోడని చెబితే తనకు ఏం విలువ ఉంటుందని ప్రశ్నించారు. తాను ఎక్కడ ఉన్నా ఉన్నది ఉన్నట్లుగానే మాట్లాడతానని గంగవ్వ అన్నారు. గంగవ్వ సమాధానాలు విని ఆశ్చర్యపోవడం ప్రేక్షకుల వంతవుతోంది.

మరోవైపు గంగవ్వ బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు రావడం గురించి సోషల్ మీడియాలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. బిగ్ బాస్ నిర్వాహకులు గంగవ్వతో ముందుగానే ఐదు వారాలు ఉండాలని కాంట్రాక్ట్ కుదుర్చుకున్నారని.. ఆ కాంట్రాక్ట్ ప్రకారమే గంగవ్వను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించారని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుండటం గమనార్హం.