టెస్టు మ్యాచ్ మధ్యలో అభిమాని హంగామా.. వీడియో వైరల్..!

టీమిండియా టెస్టులను ఇంగ్లండ్ తో ఆడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే రెండు టెస్టులు పూర్తవగా మూడో టెస్టు కోసం ఇరు ఆటగాళ్లు ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అయితే రెండో టెస్టు మూడో రోజు లంచ్ విరామం తర్వాత ఆటగాళ్లు మైదానంలోకి అడుగు పెడుతున్న సమయంలో ఒక ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది. అందేంటంటే.. ప్రేక్షకుల గ్యాలరీ నుంచి వచ్చిన జార్వో అనే ఒక అభిమాని టీమిండియా ఆటగాళ్లతో కలిసి గ్రౌండ్‌లోకి వెళ్లిపోయి నానా హంగామా చేసిన విషయం తెలిసిందే.

అయితే మొదట వాళ్లు జార్వోని గుర్తుపట్టలేకపోయినప్పటికీ ఆ తర్వాత తేరుకున్న భద్రతా సిబ్బంది వచ్చి అతన్ని తీసుకెళ్లారు. భారత్‌కు ఆడిన తొలి ఇంగ్లండ్‌ ఆటగాడిని తానేనంటూ గట్టిగా అరుస్తూ చెప్పడం ట్రెండింగ్‌గా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా వైరల్‌ అయింది. అయితే అతడు ఇలాంటి పనులు చేయడం కొత్తేమి కాదు.. మ్యాచ్ జరుగుతున్న సమయంలోనే జార్వో చేసిన మరో పని ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది.

అది ఎప్పుడు జరిగిందో తెలియదు కానీ.. ఇంగ్లండ్, ఆస్ట్రేలియా మధ్య మ్యాచ్ టెస్టు మ్యాచ్ జరుగుతుందని తెలుస్తోంది. అతడు గ్రౌండ్ లో ఉన్న బౌండరీ లైన్ క్రాస్ చేసి.. లోపలికి వెళ్లి తనతో పాటు తెచ్చుకున్న టెంట్ వేసుకొని అందులో పడుకున్నాడు. కొన్ని సెకన్ల పాటు అలా పడుకొని లేచి విక్టరీ సింబల్ చూపించాడు. తాను అనుకున్నది సాధించినట్లు ఆనందంలో ఉండగా.. అక్కడకు వచ్చిన భద్రతా సిబ్బంది అతడిని తీసుకెళ్లారు.

ఈ వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. తాజాగా అతడు టీమిండియా క్రికెటర్లతో హంగామా చేసిన వీడియో వైరల్ అవ్వగా.. అంతక ముందు జరిగిన ఈ వీడియో కూడా సోషల్ మీడియలో వైరల్ అవుతున్నాయి. ఇక లార్డ్స్‌ టెస్టులో 151 పరుగుల తేడాతో ఇంగ్లండ్ టీమ్ ను చిత్తు చేసింది టీమిండియా. ఐదు టెస్ట్ ల సిరీస్ లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది కోహ్లీసేన. మూడో టెస్టు ఈ నెల 25 నుంచి జరగనుంది.