స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది. 4726 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇంటర్ పాసైన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. తక్కువ వయస్సులోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో చేరాలనే వారికి ఈ ఉద్యోగాలు మంచి అవకాశమని చెప్పవచ్చు. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ ద్వారా సార్టింగ్ అసిస్టెంట్, జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్, లోయర్ డివిజనల్ క్లర్క్, డాటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగాలను భర్తీ చేయనుంది.
ఈ ఉద్యోగాలకు కేవలం ఆన్ లైన్ లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. లక్షల సంఖ్యలో అభ్యర్థులు ఈ ఉద్యోగాల కోసం పోటీ పడే అవకాశం ఉందని సమాచారం. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ పరీక్షలో మొత్తం మూడు విభాగాలు ఉండగా 200 మార్కులకు 100 అబ్జెక్టివ్ ప్రశ్నలు ఉంటాయి. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, జనరల్ అవేర్నెస్, ఇంగ్లిష్ లాంగ్వేజ్, జనరల్ ఇంటెలిజెన్స్ ఒక్కో విభాగానికి 25 ప్రశ్నల చొప్పున ఉంటాయి.
ఈ పరీక్ష ద్వారా ఎంపికైన వారు టైర్ 2 కు, టైర్ 2 పరీక్షలో ఎంపికైన వారికి టైర్ 3 పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం ఉద్యోగాలలో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్, లోయన్ డివిజనల్ క్లర్క్ ఉద్యోగాలు 1538 ఉండగా సార్టింగ్ అసిస్టెంట్ లేదా పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలు 3181 ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 100 రూపాయలు కాగా డిసెంబర్ 15, 2020 దరఖాస్తు చేయడానికి చివరి తేదీగా ఉంది.
‘ :https://ssc.nic.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. 2021 సంవత్సరం ఏప్రిల్ నెల 12 నుంచి 27వ తేదీ వరకు టైర్ 1 పరీక్ష జరుగుతుంది. 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాల లోపు వయస్సు వాళ్లు ఈ ఉద్యోగాల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపులు ఉంటాయి.