Tag Archives: chennai rains

ఆ కుటుంబాలకు రెండు వేల తక్షణ ఆర్థిక సహాయం ప్రకటించిన సీఎం జగన్!

ఆంధ్ర ప్రదేశ్ లో వరుసగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా రోడ్లు, నదులు, కాలువలు జలమయమయ్యాయి. ఇళ్లలోకి కూడా పెద్ద ఎత్తున నీరు చేరడంతో ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని గుప్పుగుప్పు మంటూ బతుకుతున్నారు. ఇప్పటికే ఏపీలో పలు ప్రాంతాలలో కుండపోత వర్షాల కారణంగా చాలా మంది గల్లంతయ్యారు. పలుచోట్ల మూగజీవాలు కొట్టుకుపోయాయి. వర్షం బీభత్సం కారణంగా అక్కడి ప్రజలకు వెంటనే సహాయ సహకారాలు అందించాలని సీఎం జగన్ ఆదేశించారు.

ఏపీ లోని మూడు జిల్లాలకు వెంటనే ప్రత్యేక అధికారులను నియమించారు. ఈ క్రమంలోనే నెల్లూరుకు సీనియర్ అధికారి రాజశేఖర్, చిత్తూరుకు ప్రద్యుమ్న, కడపకు శశిభూషణ్ కుమారులను నియమించారు. బాధితులను ఆదుకోవడానికి యుద్ధప్రాతిపదికన పని చేయాలని ఆదేశించారు. వరద బీభత్స ముంపుకు గురైన ప్రతి కుటుంబానికి రెండు వేల రూపాయలు ఇవ్వాలని సూచించారు. అలాగే వరదల వల్ల ప్రాణాలు కోల్పోయిన వ్యక్తుల కుటుంబాలకు 5 లక్షల పరిహారం అందించాలని అధికారులను ఆదేశించారు.

పరిహారాలను వీలైనంత త్వరగా అందించాలని వైయస్ జగన్ ఆదేశించారు. పంటల నష్టంపై అంచనాలు వేసి రైతులు మళ్లీ పంటలు వేసుకునేందుకు విత్తనాలు సరఫరా చేయాలని ఆదేశించారు. అలాగే చెరువులు, రిజర్వాయర్లు, పక్కన ఉన్న గ్రామాల పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

అలాగే తిరుమల తిరుపతికి వచ్చిన భక్తులకు సహాయంగా ఉండాలని అధికారులను ఆదేశించారు జగన్. రైలు విమానాలు రద్దు అయిన కారణంగా వారికి అన్ని రకాలుగా తోడుగా ఉండాలని అన్నారు. ఇప్పటికే కడప జిల్లాలో వరదలతో స్వర్ణముఖీ నది ఉద్ధృతతో రోడ్డు తెగిపోయింది. చిత్తూరు జిల్లాలో భారీ వర్షాలకు రోడ్లు,బ్రిడ్జీలు కొట్టుకుపోతున్నాయి. ఇక అనంతపురం జిల్లా చిత్రావతి నది ఉధృతంగా ప్రవహించడంతో నదిలో ఎనిమిది మంది చిక్కుకుపోయారు. ఇలా ఏపీలో పలు ప్రదేశాలలో వరద బీభత్సం వల్ల ప్రజలు ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు.