Tag Archives: girl friend home

ప్రియురాలి ఇంట్లో చేపల పులుసు తిన్నాడు.. దారుణంగా?

ఇద్దరు ఒకరికొకరు ప్రాణంగా ప్రేమించుకున్నారు. ఈ ప్రేమ వ్యవహారం ఇంట్లో తెలియడంతో తనతో పెళ్లికి తన ప్రేయసి కుటుంబీకులు ఒప్పుకోలేదు. తర్వాత ప్రియుడు నచ్చజెప్పడంతో పెళ్లికి ఒప్పుకున్న అమ్మాయి తరపు వాళ్ళు నిశ్చితార్థ వేడుకలను నిర్వహించారు. అయితే అత్తగారి ఇంటికి వెళ్ళిన అల్లుడికి అతిధి మర్యాదలు ఎంతో చక్కగా చేశారు.అల్లుడొచ్చాడు అని చేపల పులుసు వండి ప్రియురాలు ఎంతో ప్రేమగా తినిపించడం తో ప్రియుడు ఎంతో మురిసిపోయాడు. చేపల పులుసు తిన్న తర్వాత వాంతులు చేసుకుని మరణించాడు. అతని మరణం వెనుక కారణం ఎవరు? ఇది సహజ మరణమేనా లేక హత్యాయత్నం? అసలేం జరిగింది.. పూర్తి వివరాల్లోకి వెళితే..

కేరళలోని మున్నార్‌కు చెంది నిషాంత్ (30) చెన్నైలో ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్నాడు. తమిళనాడులోని అరియలూరు జిల్లా గంగైకొండచోళపురం ప్రాంతానికి చెందిన ఓ యువతి చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తోంది. ఈ క్రమంలోనే వీరిద్దరికీ పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్త ప్రేమగా మారింది.వీరి ప్రేమ వ్యవహారం అమ్మాయి తరపు ఇంట్లో తెలియగానే వీరి పెళ్లికి నిరాకరించారు.నిశాంత్ బలవంతంగా ఒప్పించడంతో పెళ్ళికి ఒప్పుకొని నిశ్చితార్థం కూడా జరిపించారు.

మే 17న వీరు పెళ్లి కావాల్సి ఉండగా కరోనా నేపథ్యంలో పెళ్లి వాయిదా పడింది.ఈ క్రమంలోనే నిషాంత్ పనిచేస్తున్న ఆఫీసుకు సెలవులు ప్రకటించడంతో అతను కేరళలో లాక్ డౌన్ ఉన్న కారణంగా కాబోయే తన అత్త వారి ఇంటికి వెళ్ళాడు. అల్లుడొచ్చాడని అత్తింటివారు అల్లుడికి చేపలు వండి భోజనం పెట్టారు.భోజనం తిన్న కాసేపటికే నిషాంత్ కి వాంతులు కావడంతో కుటుంబ సభ్యులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రికి వెళ్లే లోపే నిశాంత్ మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు.

చేపల పులుసు తిన్న కుటుంబ సభ్యులందరికీ ఏమీ కాకుండా నిశాంత్ ఒక్కడికే వాంతులు కావడంతో నిశాంత్ కుటుంబ సభ్యులకు అనుమానాలు తలెత్తుతున్నాయి. నిశాంత్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే నిశాంత్ పై హత్యా యత్నం జరిగిందా లేక సహజ మరణమా అనే విషయం తెలియాలంటే పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చే వరకు వేచి ఉండాలని పోలీసులు తెలిపారు.