Tag Archives: mp murders

ఒకే కుటుంబంలో ఐదుగురి మహిళలు అదృశ్యం.. నెల తర్వాత బయట పడిన షాకింగ్ నిజాలు!

ఒకే కుటుంబంలోని ఐదుగురు మహిళలు ఉన్నఫలంగా అదృశ్యమయ్యారు. వీరు కనిపించకపోవడంతో మిస్సింగ్ కేసు కింద ఈ మహిళలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ క్రమంలోనే దర్యాప్తును కొనసాగిస్తున్న పోలీసులకు నెల రోజుల తర్వాత ఎంతో భయంకరమైన నిజాలు వెలుగులోకి వచ్చాయి. అసలు అదృశ్యమైన మహిళలు ఏమయ్యారు అనే విషయాలను దేవాస్ పోలీసులు తెలియజేశారు.

మధ్యప్రదేశ్ దేవాస్ జిల్లాకు చెందిన మమతా, ఆమె ఇద్దరు కుమార్తెలు రూపాలీ (21), దివ్య (14), మరో ఇద్దరు బాలికలు మే 13 నుంచి కనిపించకుండాపోయారు. మమత పెద్ద కుమార్తె రూపాలీ అదే గ్రామానికి చెందిన సురేంద్ర చౌహన్ అనే వ్యక్తితో ప్రేమలో పడింది. ఈ క్రమంలోనే సురేంద్ర చౌహన్ మరొక అమ్మాయితో వివాహానికి సిద్ధమయ్యాడని తెలుసుకున్న రూపాలీ సురేందర్ ఫోటో, అతని ఫోన్ నెంబర్ ఫేస్ బుక్ లో ఆయనే తనకు కాబోయే భర్త అంటూ పోస్ట్ చేసింది. రూపాలీ ఈ విధంగా ప్రవర్తించడం తో ఎంతో ఆగ్రహం చెందిన సురేందర్ ఎలాగైనా ఆమె ప్రతీకారం తీర్చుకోవాలని భావించాడు.

ఈ క్రమంలోనే రూపాలి కుటుంబాన్ని హత్య చేసి వారి శవాలు పోలీసులకు దొరకకుండా వేర్వేరు గ్రామాలలో పాతి పెట్టాడు. అదేవిధంగా పోలీసులకు అనుమానం రాకుండా శవాల మీద ఉన్న దుస్తులను తొలగించి వాటిని కాల్చివేశాడు. శవాలు దుర్వాసన రాకుండా ఉండటం కోసం ఉప్పు, యూరియా వేసి పాతి పెట్టాడు.

ఈ కేసుపై దర్యాప్తు చేస్తున్న పోలీసులు పలువురిపై నిఘా ఉంచి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా అసలు విషయం బయటపడింది.సురేంద్ర చౌహన్ పథకం వేయడంతో వీరు కేవలం శవాలను పాతి పెట్టడానికి మాత్రమే సహాయం చేసినట్లు పోలీసుల ఎదుట ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే శవాలను ఎక్కడ పాతి పెట్టారు అనే విషయాలను తెలుసుకుని వాటిని వెలికి తీసి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా మరికొందరు నిందితుల కోసం పోలీసులు గాలింపు చర్యలు చేస్తున్నట్లు తెలిపారు.