నిరుద్యోగులకు శుభవార్త.. 18 వేల టీచర్ పోస్టులకు నోటిఫికేషన్..?

తెలంగాణలో గత రెండు సంవత్సరాల నుంచి ఎలాంటి నోటిఫికేషన్లు విడుదల కాలేదు. దీంతో ఉద్యోగాల కోసం ప్రిపేర్ అవుతున్న నిరుద్యోగులు తీవ్ర అసహనంతో ఉన్నారు. కోచింగ్ లు తీసుకొని.. వేలల్లో ఖర్చు పెట్టి.. హాస్టల్ లో ఉండి చదువుకుంటున్నారు.

అయితే ఇన్ని చేస్తున్నా నోటిఫికేషన్ మాత్రం రాకపోవడంతో ప్రభుత్వంపై ఆగ్రహంతో ఉన్నారు. జనరల్ నోటిఫికేషన్ ఒక్కటి కూడా విడుదల చేయడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే నాలుగు నెలల క్రితం టీఎస్పీఎస్సీ నుంచి ఓ నోటిఫికేషన్ విడుదల చేసినా.. అది అందరికీ ఎలిజిబిలిటీ లేనిదే. కామన్ నోటిఫికేషన్ అంటే గ్రూప్ 3, గ్రూప్ 4, గ్రూప్ 1 నోటిఫికేషన్లు వేయాలంటూ నిరుద్యోగులు కోరుతున్నారు.

ఈ మధ్య టీఎస్పీఎస్సీ దగ్గర నిరసనలు కూడా వ్యక్తం చేశారు. తాజా సమాచారం మేరకు తెలంగాణ ప్రభుత్వం ఓ శుభవార్త అందించింది. రాష్ట్రంలో 18వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని అధికారులు తెలిపారు. 1.20 లక్షల టీచర్ పోస్టులకు గాను ప్రస్తుతం 1.02 లక్షల మంది పనిచేస్తున్నారని పేర్కొన్నారు. వీటిని కొత్తగా ఏర్పడిన జిల్లాల వారీగా విభజించి.. కేటాయించనున్నారని తెలుస్తోంది.

దీనికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసేందుకు అధికారులు సమాయత్తం అవుతున్నారనే సమాచారం. వీటితో పాటు.. బోధనేతర సిబ్బంది 1500 పోస్టులు, డైట్, బీఈడీ కాలేజీలు, విద్యాశాఖ కార్యాలయాల్లో పోస్టులను సైతం కొత్త జిల్లాల వారీగా విభజించేందుకు కసరత్తు చేస్తున్నారు. వీటిని కూడా త్వరలో భర్తీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధం అవుతోంది.