ఆ దర్శకుడిని కొట్టకుండా ఉండడమే నేను చేసిన అతి పెద్ద తప్పు… నటి ఐశ్వర్య ఆసక్తికర వ్యాఖ్యలు..!

ఐశ్వర్యగా ప్రసిద్ధి చెందిన శాంత మీనా.. నటి లక్ష్మి కుమార్తె. ఆమె తమిళం, మలయాళంతో పాటు తెలుగు సినిమాలలో నటించింది. అయితే ఇటీవల ఆమె ఈటీవీలో అలీ హోస్ట్ గా ప్రసారం అవుతున్న అలీతో సరదాగా ప్రోగ్రామ్ లో పాల్గొన్నారు. దీనికి సంబంధించి ఇంటర్వ్యూ ప్రోమో విడుదలైంది. దానిలో ఆమె పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు.

ఐశ్వర్య ఇలా చెబుతూ.. తాను స్ట్రెయిట్ ఫార్వర్డ్ వ్యక్తినని.. అనవసరమైన వాటి జోలికి తాను వెళ్లనని చెప్పుకొచ్చింది. ఇక ఓ దర్శకుడు చేసిన పనులను తాను అస్సలు మర్చిపోలేదని.. అయినా తాను అన్ని మర్చిపోయి అతడి వద్దకు వెళ్లి పలకరించాను అని చెప్పింది. తన ముందు అన్నీ బాగానే మాట్లాడి.. తాను వెళ్లిపోయిన తర్వాత లేనిపోనివి చెబుతూ కోపం తెప్పిస్తాడని ఆరోపించింది.

ఆ దర్శకుడిని తాను కొట్టకుండా తప్పు చేశానని.. నా కెరీర్ లో చేసిన అతి పెద్ద తప్పు అదే అని చెప్పింది. ఆ ఒక్క దర్శకుడు తప్ప.. తాను సినిమాలు చేసిన ప్రతీ దర్శకుడిని గౌరవిస్తానని.. ప్రతీ ఒక్కరు నాకు గురువులతో సమానం అంటూ చెప్పుకొచ్చారు. ఇక తాను సినిమా ఇండస్ట్రీకి వస్తానని ఎప్పుడూ అనుకోలేదన్నారు. ఇక ఈ ప్రోమోలో మరో విషయాన్ని ప్రస్తావించారు.

ఎవరైనా తనకు ఫోన్ చేసి.. ఎలా ఉన్నావు అని అడగకుండా.. ఎక్కడ ఉన్నావు అని అడిగితే ఒళ్లు మండిపోతుందని చెపుకొచ్చింది. తాను సినిమా బ్రేక్ సమయంలో వెళ్లి వస్తానని చెప్పి.. పెళ్లి చేసుకున్నానని.. అంతే స్పీడ్ లో విడాకులు కూడా జరిగాయంటూ చెప్పుకొచ్చారు. ఇక చివరగా ఎందుకు తల్లితో దూరంగా ఉంటున్నావని అలీ అడగ్గానే భావోద్వేగానికి లోనయ్యారు.