ఉత్తేజ్ కు సతివియోగం.. పరామర్శించిన మెగస్టార్ చిరంజీవి.. కంటతడి పెట్టిన ప్రకాశ్ రాజ్

ఎన్నో విలక్షణమైన పాత్రలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు ఉత్తేజ్‌. అతడి ఇంట నేడు విషాదం చోటుచేసుకుంది. ఆయన సతీమణి పద్మావతి కన్నుమూశారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె సోమవారం ఉదయం బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. భార్య ఆకస్మిక మరణంతో ఉత్తేజ్‌, ఇతర కుటుంబసభ్యులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటిస్తూ ఉత్తేజ్‌ను పరామర్శిస్తున్నారు. ఉత్తేజ్ భార్య చనిపోయిన విషయం తెలిసిన వెంటనే మెగాస్టార్ చిరంజీవి, ప్రకాష్ రాజ్, జీవిత రాజశేఖర్‌తో పాటు పలువురు నటీనటులు.. ఆసుపత్రికి వెళ్లి ఉత్తేజ్ కుటుంబ సభ్యులను పరామర్శించారు.

మెగస్టార్ ను చూసిన వెంటనే ఉత్తేజ్ గుండెలవిసేలా విలపించాడు. మెగస్టార్ ను వాటేసుకొని బోరున విలపించాడు. ఈ దృశ్యాలను చూసిన ప్రతి ఒక్కరు కన్నీంటి పర్యంతమయ్యారు. ప్రకాశ్ రాజు కూడా కన్నీళ్లు పెట్టుకున్నారు. ఉత్తేజ్ ని ఓదార్చే ప్రయత్నం చేశాడు. మెగస్టార్ మరియు అతడితో వచ్చిన పలువురు సినీ ప్రముఖులు వాళ్ల కుటుంబసభ్యులను ఓదార్చారు.

అక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరూ ఆమె మరణం పట్ల సంతాపం ప్రకటించారు. ట్విట్టర్ లో కూడా చాలామంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా.. పద్మావతి.. ఉత్తేజ్‌ చేసే సేవా కార్యక్రమాల్లో భాగస్వామి అయ్యేవారు. ఉత్తేజ్‌కు చెందిన మయూఖ టాకీస్‌ ఫిల్మ్‌ యాక్టింగ్‌ స్కూల్‌ నిర్వహణలో ఆమె విధులు నిర్వర్తించేవారు.