బైక్ తో పాటు వ్యక్తిని కూడా ఎత్తేశారు ట్రాఫిక్ పోలీసులు.. ఏం జరిగిందంటే..

సాధారణంగా నో పార్కింగ్ ఏరియాలో వాహనాలను నిలిపితే వాటిని ట్రాఫిక్ పోలీసులు పెద్ద వాహనంలో క్రేన్ తో తీసుకెళ్లడం సహజం. కానీ ఇక్కడ ఓ ద్విచక్ర వాహనంపై మనిషి ఉన్నా అతడితో పాటే బండిని కూడాలేపి ట్రాఫిక్ టోయింగ్ వాహనంలో పడేశారు. ఇలా నిబంధనలు ఉల్లఘించే క్రమంలో వాహన యజమానులపై చర్యలు తీసుకునే క్రమంలో ట్రాఫిక్ పోలీసులు కొన్నిసార్లు విమర్శల పాలవుతున్నారు. తాజాగా ఇలాంటిదే.. బైక్‌ను నో పార్కింగ్ ఏరియా నుంచి నుంచి తొలగించే సమయంలో.. ఓ వ్యక్తి బైక్‌పై ఉన్నాడు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ ఘటన మహారాష్ట్రలోని పుణెలో చోటుచేసుకుంది. అసలేం జరిగిందంటే.. నానాపత్ ప్రాంతంలో ఎప్పటిలాగే ట్రాఫిక్ పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా.. నో పార్కింగ్ జోన్ల‌లో ఉన్న వాహనాలను టోయింగ్‌ వాహనంలోకి ఎక్కిస్తున్నారు. ఈ కార్యక్రమంలో సమర్త్ బ్రాంచ్‌కు చెందిన ట్రాఫిక్ పోలీసుతో పాటు కాంట్రాక్ట్ సిబ్బంది కూడా పాల్గొన్నారు. అయితే వారు ఓ బైక్ ను టోయింగ్ వాహనంలో ఎక్కిస్తున్న క్రమంలో ఆ వాహన యజమాని అక్కడకు చేరుకొని ఆ చర్యను నిలిపే ప్రయత్నం చేశాడు.

ఆ బైక్ ను టోయింగ్ వాహనంలో ఎక్కిస్తుండగా.. దానిపైనే కూర్చున్నాడు. బైక్ నుంచి దిగండంటూ.. ఎంత చెప్పినా అతడు ట్రాఫిక్ పోలీసుల మాట వినలేదు. దీంతో అతడు బైక్ పై ఉన్నా కూడా ఆ బండిని వాహనంలో ఎక్కించేశారు. అయితే ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో నెటిజన్లు.. పోలీసుల చర్యపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంఘటనపై ట్రాఫిక్ డిప్యూటీ కమిషనర్ రాహుల్ శ్రీరామ్ స్పందిస్తూ.. టోయింగ్ వ్యాన్‌లోని బైక్‌ను ఎక్కించిన తర్వాత ఈ ఘటన జరిగిందని అన్నారు.

బైక్‌పై దాని యజమాని ఎక్కే సమయానికే పూర్తిగా ఎత్తివేయబడిందని చెప్పారు. అతడిని సిబ్బంది వారించినా వినలేదని చెప్పుకొచ్చాడు. ఈ క్రమంలోనే బైక్‌ను, అతడితోపాటుగా వ్యాన్ క్యారేజ్‌పై ఉంచబడిందన్నారు. అయితే తర్వాత సదరు వ్యక్తి క్షమాపణ చెప్పాడని.. జరిమానా కూడా చెల్లించినట్లు చెప్పారు. ఈ ఘటనలో పాల్గొన్న కాంట్రాక్ట్ సిబ్బందితో పాటు ట్రాఫిక్ పోలీసులపై చర్యలకు ఆదేశించినట్లు అతడు పేర్కొన్నారు.