‘కత్తి మహేష్ కోలుకోవాలంటూ..’ తొలిసారి స్పందించిన జనసేనాని..

కత్తి మహేష్.. కేవలం పవన్ కళ్యాణ్ ని విమర్శించడం ద్వారా మాత్రమే కత్తి మహేష్ ఫేమస్ అయ్యాడని చెబుతుంటారు పవన్ ఫాన్స్.. అయితే విమర్శలు అందరూ చేయొచ్చు కానీ.. ఆ విమర్శలకు కూడా కొన్ని హద్దులు ఉంటాయి. అయితే పవన్ విషయంలో కత్తి మహేష్ అనేక సార్లు హద్దులు దాటి మరీ విమర్శించిన విషయం తెలిసిందే.. అందుకే కత్తి మహేష్ ను లక్ష్యంగా చేసుకుని పవన్ అభిమానులు చాలాసార్లు విమర్శించారు.

అయితే ఈ కత్తి మహేష్ చేసిన విమర్శలపై పవన్ సోదరుడైన నాగబాబు కూడా స్పందించాడు కానీ.. పవన్ మాత్రం ఏరోజూ నోరెత్తి మాట్లాడింది లేదు. హద్దుమీరి విపరీమైన విమర్శలు చేస్తున్న సమయంలో కూడా మహేష్ మాటలను పవన్ ఏమాత్రం పట్టించుకోలేదు. ఇదంతా అందరికీ తెలిసిందే.. అయితే కొన్ని రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో కత్తి మహేష్‌ తీవ్రంగా గాయపడ్డాడు. నెల్లూరు ప్రధాన రహదారిలో ఈయన ప్రయాణిస్తున్న కారు ఆగి ఉన్న లారీని వేనున నుండి ఢీ కొట్టింది. దాంతో కత్తి మహేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. ఆ తర్వాత ఆయన్ని వెంటనే నెల్లూరు హాస్పిటల్‌కు తరలించడం అక్కడనుంచి మెరుగైన చికిత్స కోసం చెన్నై ఆస్పత్రికి తరలించారు. గత 10 రోజులుగా చెన్నై ఆసుపత్రిలోనే చికిత్స తీసుకుంటున్నాడు కత్తి మహేష్. అయితే ఈ ప్రమాదం తరువాత మహేష్ ను అభిమానించే వాళ్ళు, అలాగే ఆయన్ని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళు కూడా కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నారు.

ఈ నేపధ్యంలో కత్తి మహేష్ కు జారిన ప్రమాదంపై పవన్ కళ్యాణ్ మొదటి సారి స్పందించినట్లు సమాచారం. తాజాగా రాజకీయాలలో భాగంగా విజయవాడ వచ్చిన పవన్.. మహేష్ కత్తి కు జరిగిన ప్రమాదం గురించి పవన్ అభిమానులు, జనసైనికులతో మాట్లాడినట్టు తెలుస్తుంది. ఈ క్రమంలో కత్తి ఆరోగ్యం గురించి అయన అడిగి తెలుసుకున్నారట. అదే క్రమంలో కత్తి మహేష్ త్వరగా కోలుకోవాలని అయన ఆకాంక్షించారని వార్తలు వస్తున్నాయి. ఈ సంధర్బంలో పవన్ మాట్లాడుతూ.. ఎంత ఆగర్భ శత్రువు అయినా కూడా చనిపోవాలి ఎవరూ కోరుకూడదని.. భావ వైరద్యాలకు ప్రత్యర్ధి మరణమే పరిష్కారం అయితే ఈ ప్రపంచంలో మనుషుల కంటే శవాలే ఎక్కువగా ఉంటాయని చాలా హూందాగా పవన్ స్పందించినట్లు తెలుస్తుంది. పవన్ స్పందనను మెగాభిమాని, నటుడు జోష్ రవి తన ఫేస్ బుక్ పేజీలో పోస్ట్ చేసాడు.