కాల్ చేసి విసిగిస్తున్నాడని హీరో గోపీచంద్‌కి డైరెక్టర్ తేజా వార్నింగ్ ఇచ్చారా..?

తొట్టెంపూడి గోపీచంద్.. ప్రముఖ తెలుగు చిత్ర దర్శకులు తొట్టెంపూడి కృష్ణ కొడుకుగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు. గోపీచంద్ హీరోగా నటించిన మొదటి సినిమా తొలివలపు. స్నేహ ఈ మూవీలో హీరోయిన్‌గా నటించింది. ప్రముఖ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. పెద్ద దర్శకుడి వారసుడిగా ఇండస్ట్రీలో ఎంట్రీ ఈజీగానే జరిగింది. కానీ హిట్ మాత్రం దక్కలేదు. దాంతో మళ్ళీ గోపీచంద్‌కి హీరోగా అవకాశాలు రాలేదు. దాంతో విలన్ పాత్రలు చేయడానికి సిద్దమయ్యాడు. తేజ దర్శకత్వంలో వచ్చిన జయం సినిమాలో విలన్ గా నటించే అవకాశం వస్తే ఒప్పుకున్నాడు.

నితిన్, సదా ఈ సినిమాతో హీరో, హీరోయిన్స్ గా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీకి పరిచయం అయ్యారు. భారీ హిట్ గా నిలిచిన ఈ సినిమాలో గోపీచంద్ పాత్రకి చాలా మంచి పేరు వచ్చింది. జయం సినిమాలో పోషించిన పాత్రతో టాలీవుడ్ మేకర్స్ గోపీచంద్ కి విలన్ రోల్స్ ఇవ్వడానికి ఆసక్తి చూపించారు. మంచి హైట్ కాబట్టి హీరోలను ఢీకొట్టే విలన్ గా పర్‌ఫెక్ట్‌గా సూటవుతాడని అందరూ చెప్పుకున్నారు. గోపీచంద్ కూడా నటన అంటే ఎంతో ఆసక్తి ఉండటంతో వచ్చిన అవకాశం హీరోనా, విలనా అని చూడకుండా సిల్వర్ స్క్రీన్ మీద సందడి చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకోవాలనుకున్నాడు.

ఈ క్రమంలోనే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తేజ దర్శకత్వంలో వచ్చిన నిజం సినిమాలో దేవుడు పాత్ర పోషించాడు. మరీ కౄరమైన పాత్ర కావడంతో బాగా ఎలివేట్ అయి బాగా పేరు వచ్చింది. ఇలా వరుసగా రెండు సినిమాలు తేజ దర్శకత్వంలో నటించి బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ రెండు సినిమాల తర్వాత గోపీకి వచ్చిన క్రేజ్ చూసి ప్రముఖ నిర్మాత ఎం.ఎస్.రాజు ప్రభాస్ – త్రిష జంటగా తెరకెక్కిన వర్షం సినిమాలో ప్రభాస్ ని ఢీకొట్టే పాత్రను ఆఫర్ చేశారు. ఈ పాత్రలో గోపీచంద్ అద్భుతంగా నటించాడు. మూడు సినిమాల తర్వాత ఇండస్ట్రీలో విలన్ అంటే గోపీచంద్ పేరే చెప్పుకున్నారు.

కానీ అనూహ్యంగా గోపీచంద్ తండ్రికి అత్యంత సన్నిహితుడైన ప్రముఖ నిర్మాత గోపీచంద్ ని హీరోగా పెట్టి సినిమా నిర్మించారు. మొదటి సినిమా హీరోగా ఫ్లాప్.. తర్వాత మూడు సినిమాలు విలన్ గా నటించాడు. దాదాపు అందరూ గోపీచంద్ లో విలన్ నే చూశారు. కానీ పోకూరి బాబూరావు మాత్రం హీరోను చూశారు. అందుకే యజ్ఞం సినిమాను నిర్మించి హీరోగా గోపీచంద్ కి కొత్త జీవితాన్నిచ్చారు. ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాంతో ఒక్కసారిగా విలన్ నుంచి హీరోగా గోపీచంద్ లైఫ్ యూ టర్న్ తీసుకుంది. యజ్ఞం తర్వాత మళ్ళీ ఇప్పటివరకు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.

అయితే ఈ స్థాయికి రావడానికి కారణం అయిన తేజని మాత్రం గోపీచంద్ ముందు తేజకి కాల్ చేసి నాకు ఓ క్యారెక్టర్ ఉంటే ఇవ్వమని రిక్వెస్ట్ చేసేవాడట. ఇలా రెండు మూడుసార్లు చూసిన తేజ సీరియస్ గా వార్నింగ్ ఇచ్చిన రేంజ్ లో నాకు అవసరం అయితే నేనే చెప్తా అప్పటి వరకు నాకు కాల్ చేయొద్దని చెప్పి కాల్ కట్ చేశాడట. కొన్నాళ్ళకి జయం సినిమాలో విలన్ పాత్ర ఇవ్వాలని ఇంటికి తేజ స్వయంగా కాల్ చేశాడట. ఆ సమయంలో గోపీచంద్ ఇంట్లో లేకపోవడంతో ఆయన చెల్లి కాల్ రిసీవ్ చేసుకొని విషయం తెలుసుకుంది. గోపీచంద్ కి కాల్ చేసి తేజ గారు కాల్ చేశారు..నిన్ను ఆడిషన్స్ కి రమ్మన్నారని చెప్పిందట. అలా జయం సినిమాలో అవకాశం అందుకున్నాడు గోపీచంద్.