రైలు ప్రయాణికులకు శుభవార్త.. త్వరలో ఇంటి ముంగిటకు సామాన్లు..!

భారతీయ రైల్వే శాఖ రైలు ప్రయాణికులకు అదిరిపోయే శుభవార్త చెప్పింది . ప్రయాణికుల రవాణా కష్టాలకు చెక్ పెట్టే విధంగా కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో ప్రయాణికుల సౌకర్యార్థం బ్యాగ్ ఆన్ వీల్ సేవలను రైల్వే శాఖ ప్రారంభించనుంది. భారతీయ రైల్వే ప్రారంభించబోయే ఈ సరికొత్త సర్వీసుల ద్వారా ప్రయాణికులకు వారి సామాన్లు ఇంటి నుంచి రైల్వే స్టేషన్ కు, రైల్వే స్టేషన్ నుంచి ఇంటికి రవాణా చేయబడతాయి.

దేశంలో ప్రముఖ రైల్వే స్టేషన్లలో రైల్వే శాఖ మొదట ఈ సర్వీసులను ప్రారంభించనుంది. అనంతరం ఇతర ప్రాంతాల్లో సైతం ఈ సర్వీసులు అందుబాటులోకి రానున్నాయి. రైల్వే శాఖ మొదట ఢిల్లీ. గురుగావ్, ఘజియాబాద్ ప్రాంతాలలో ఈ రైలు సర్వీసులను ప్రారంభించనుంది. ప్రస్తుతం ఢిల్లీ డివిజన్ యాప్ సహాయంతో ఈ సర్వీసులను ప్రారంభంచనుంది. భవిష్యత్తులో దేశమంతటా ఈ సర్వీసులు ప్రారంభమయ్యే అవకాశం ఉంది.

ప్రస్తుతం ఢిల్లీలోని వివిధ రైల్వే స్టేషన్ల ప్రయాణికులు ఈ సర్వీసులను వినియోగించుకోవచ్చని తెలుస్తోంది. రైల్వే అధికారులు బ్యాగ్ ఆన్ వీల్స్ సర్వీసుల గురించి మాట్లాడుతూ ఈ సర్వీసుల కోసం నామమాత్రపు ఛార్జీలనే వసూలు చేయనున్నట్టు వెల్లడించారు. నార్త్ సెంటర్ రైల్వే మేనేజర్ రాజీవ్ చౌదరి మాట్లాడుతూ ఇలాంటి సర్వీసులను ప్రారంభించడం ఇదే తొలిసారి అని చెప్పారు.

మరోవైపు కరోనా వైరస్, లాక్ డౌన్ వల్ల దేశవ్యాప్తంగా పరిమిత సంఖ్యలోనే రైళ్లు తిరుగుతున్నాయి. దసరా, దీపావళి పండుగల నేపథ్యంలో రైల్వే శాఖ పరిమిత సంఖ్యలో రైళ్లను నడుపుతుండగా భవిష్యత్తులో రైలు ప్రయాణికుల సౌకర్యార్థం మరిన్ని రైళ్లు అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని అధికారులు చెబుతుండటం గమనార్హం.