పెళ్ళైన 11 నెలలకే గుండెపోటుతో భర్త మృతి.. యువతి షాకింగ్ నిర్ణయం..?

అగ్నిసాక్షిగా మూడుముళ్ల బంధంతో, ఏడు అడుగులు నడిచి కష్టసుఖాలలో జీవితాంతం తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భర్త అర్ధాంతరంగా తనను వదిలి, ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతే ఆ యువతి బాధ వర్ణనాతీతం. ఈ భూమి పై తన భర్త ఇక లేడు అనే నిజాన్ని నమ్మలేని ఆ భార్య తన భర్త లేని జీవితం తనకు అవసరం లేదని ఆత్మహత్య చేసుకున్న ఘటన పలువురిని కంటతడి పెట్టించిన హృదయ విదారక ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

కర్ణాటకలోని మండ్య జిల్లా నాగమంగళ తాలూకా బొమ్మనహళ్లికి చెందిన కిరణ్‌ (30), పూజా (22)లకు 11 నెలల క్రితం వివాహం జరిగింది. ఎంతో సంతోషంగా సాగిపోతున్న వీరి వైవాహిక జీవితాన్ని చూసి రెండు కుటుంబాల పెద్దలు ఎంతో సంతోషించేవారు. అయితే ఆ సంతోషం వారిలో ఎక్కువ కాలం నిలవలేదు. వీరి సంతోషం చూసి ఎవరికి అసూయ పుట్టిందో ఏమో కానీ మృత్యువు రూపంలో వీరి సంతోషాన్ని కబలించింది.

శుక్రవారం ఉన్నఫలంగా కిరణ్ కి గుండెపోటు రావడంతో మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు బెంగళూరు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు.ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కిరణ్ శనివారం ఉదయం మరణించడంతో అతని కుటుంబ సభ్యులు మృతదేహాన్ని సొంత గ్రామానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు.

తాను ఎంతగానో ప్రేమించే తన భర్త మరణ వార్తను భార్య పూజ తట్టుకోలేకపోయింది. తన భర్త లేడన్న చేదు వార్తను దిగమింగే లేక తన భర్తను అంత్యక్రియలకు తీసుకు వెళ్ళగానే తాను ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన చూసిన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కసారిగా తన బిడ్డలిద్దరిని కోల్పోవడంతో ఆ తల్లిదండ్రుల బాధ వర్ణనాతీతం. ఈ షాక్ నుంచి తేరుకున్న కుటుంబసభ్యులు కొంత సమయానికి పూజ మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు.