ఇండియా పోస్టు నుంచి శుభవార్త.. ఆ లిమిట్ ను పెంచుతూ నిర్ణయం..

ఇండియా పోస్ట్ ఆఫీసు ఖాతాదారులకు శుభవార్త. తన ఖాతాదారుల డైలీ విత్ డ్రా లిమిట్ ను ఇండియా పోస్ట్ రూ.20,000 వరకు విత్ డ్రా చేసుకునే అవకాశం కల్పించింది. అంతకు ముందు ఈ లిమిట్ కేవలం రూ.5000 వరకు మాత్రమే ఉండేది. ఇండియా పోస్ట్ కొత్త నిబంధనల ప్రకారం ఖాతాదారులు గ్రామీణ డాక్ సేవ శాఖలో ఒక రోజులో డ్రా చేసుకునే లిమిట్ ను పెంచింది. దీంతో ఖాతాదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఈ కొత్త నిబంధనల ప్రకారం.. ఏ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్(బీపీఎం) అయినా ఒక రోజులో ఒక ఖాతాలో రూ.50,000 కంటే ఎక్కువ నగదు డిపాజిట్ గా స్వీకరించ కూడదు.. ఒక రోజులో ఒక ఖాతా ద్వారా రూ.50,000 కంటే ఎక్కువ నగదు లావాదేవీలు చేయలేము. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీం (ఎస్ సీఎస్ఎస్), మంత్లీ ఇన్ కమ్ స్కీం (ఎంఐఎస్), కిసాన్ వికాస్ పాత్రా(కేవీపీ), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్ (ఎన్ఎస్ సీ) స్కీంల కోసం డిపాజిట్ లేదా విత్ డ్రా చెక్కులు ద్వారా చేసేందుకు వీలు కల్పించారు.

పోస్టాఫీసు పొదుపు పథకంపై 4% వడ్డీ లభిస్తుంది. అయితే ఈ పొదుపు ఖాతాలో రూ.500 బ్యాలెన్స్ ఉంచాల్సి ఉంటుంది. అయితే కనీస బ్యాలెన్స్ రూ.500 కంటే తక్కువగా ఉంటే ఖాతా నిర్వహణ చార్జీల కింద జరిమానాగా రూ.100 వసూలు చేస్తారు. పోస్టాఫీసులోని వివిధ పథకాలపై వడ్డీ రేట్లను చూసుకుంటే.. పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ ఖాతా 4 శాతం, ఏడాది వరకు టీడీ ఖాతా 5.5 శాతంగా ఉంది.

రెండేళ్ల వరకు టీడీ ఖాతా 5.5 శాతం, ఐదేళ్ల వరకు టీడీ ఖాతా 6.7 శాతంగా ఉంది. ఐదేళ్ల ఆర్ డీ 5.8 శాతం, సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్ 7.4 శాతం, పీపీఎఫ్ పొదుపు పథకం 7.1 శాతం, కిసాన్ వికాస్ పాత్ర 6.9 శాతం, సుకన్య సమృద్ధి ఖాతాదారులకు 7.6శాతంగా ప్రస్తుతం వడ్డీ రేట్లు కొనసాగతున్నాయి.