రైలు ప్రయాణికులకు అలర్ట్.. అమలులోకి కొత్త నిబంధనలు..?

దేశంలో ఎక్కువమంది ఒకచోటు నుంచి మరోచోటుకు వెళ్లడానికి రైళ్లపైనే ఎక్కువగా ఆధారపడతారు. అయితే పలు సందర్భాల్లో రైల్వే శాఖ వేర్వేరు కారణాల వల్ల నిబంధనల్లో మార్పులు చేస్తూ ఉంటుంది. ప్రయాణికులకు నిబంధనలపై అవగాహన ఉంటే ఇబ్బందులు లేవు కానీ అవగాహన లేకపోతే మాత్రం ఇబ్బందులు పడక తప్పదు. రైల్వే శాఖ ట్రైన్ టికెట్ బుకింగ్ విషయంలో కీలక మార్పులు చేయడంతో పాటు కొత్త నిబంధనలను అమలులోకి తెచ్చింది.

ఇకపై ప్రయాణ సమయంలో ప్రయాణికులు మొబైల్ నంబర్ ను ఖచ్చితంగా రిజిష్టర్ చేసుకోవాలి. రైలు ప్రయాణాలు తరచూ చేసేవాళ్లు ఈ నిబంధనపై అవగాహన కలిగి ఉంటే మంచిది. చాలామంది రైలు ప్రయాణికులు టికెట్లను సొంతంగా బుక్ చేసుకోకుండా వేర్వేరు కారణాల వల్ల ఏజెంట్ల సహాయంతో బుకింగ్ చేసుకుంటున్నారు. ప్రయాణికులు ఇలా చేయడం వల్ల ప్యాసింజర్ రిజర్వేషన్ సిస్టమ్ ప్రయాణికుల మొబైల్ నంబర్ రిజిష్టర్ కావడం లేదు.

మొబైల్ నంబర్ రిజిష్టర్ కాకపోవడం వల్ల రైల్వే శాఖ రైలు ప్రయాణానికి సంబంధించిన మెసేజ్ లను పంపుతున్నా ఆ మెసేజ్ లు ప్యాసింజర్లకు చేరడం లేదు. కొన్ని సందర్భాల్లో రైళ్లు క్యాన్సిల్ కావడం లేదా వేర్వేరు కారణాల వల్ల రైలు అనుకున్న సమయానికి రాదు. ఇలాంటి సమయంలో మన మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేసుకుంటే నోటిఫికేషన్స్ ద్వారా వివరాలు తెలుస్తాయి కాబట్టి ప్రయాణ సమయంలో ఎటువంటి ఇబ్బందులు ఉండవు.

ఒకవేళ ఏదైనా కారణాల వల్ల మొబైల్ నంబర్ ను రిజిష్టర్ చేయడం సాధ్యం కాకపోతే 91 – 9881193322 నంబర్ కు వాట్సాప్ ద్వారా పీ.ఎన్.ఆర్ నంబర్ ను షేర్ చేసి రైలు ప్రయాణానికి సంబంధించిన అప్ డేట్స్ ను సులభంగా పొందవచ్చు.