శ్రీదేవి ఖాతాలో ఎన్నో బ్లాక్ బస్టర్స్.. కాని 1990 తరువాత ఆమెకు కలిసి రాని తెలుగు చిత్రాలు.!!

అందానికి నిర్వచనం శ్రీదేవి.. అభినయానికి నిదర్శనం శ్రీదేవి.. బాలనటిగా మొదలైన ఆమె ప్రస్థానం.. అంచలంచలుగా అనతి కాలంలోనే అగ్ర హీరోల సరసన నటించే అవకాశం దక్కించుకున్న అతికొద్ది కథానాయికల్లో శ్రీదేవి ఒకరు. కాలం కలిసి రావడమో లేదా శ్రీదేవి అందం, అభినయమో… మొత్తానికి ఆమె తెలుగు సినీ పరిశ్రమలో చెరగని ముద్ర వేశారు.

1980 దశకంలో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ చిత్రాలతో తీరికలేని సమయాన్ని గడిపారు. అలాంటి శ్రీదేవి 1990 దశకం వచ్చేసరికి హిందీ చిత్రాలు చేస్తున్నారు. ఆ క్రమంలో తెలుగు లో కొన్ని చిత్రాల్లో ఆమె నటించారు. అయితే అవి బాక్సాఫీస్ వద్ద ఎలా ఆడాయో చూద్దాం.

1991 దుర్గా ఆర్ట్స్, కె.ఎల్.నారాయణ నిర్మాణం, రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ‘క్షణక్షణం’ చిత్రం విడుదలైంది. తెలుగులో శివ చిత్రం తర్వాత రాంగోపాల్ వర్మకు క్షణక్షణం రెండవ చిత్రం. వర్మ కాలేజీ రోజుల్లో ఉండగానే శ్రీదేవి కి వీరాభిమాని. శ్రీదేవితో ఒక సినిమా చేయాలన్న కల ఆయనకు ‘క్షణ క్షణం’ సినిమాతో తీరిపోయింది. విడుదల తొలి విడతలో ఫ్లాప్ ను మూటగట్టుకున్న క్షణక్షణం చిత్రం.మలి విడతలో అబౌ యావరేజ్ గా నిలిచింది.

ఆ తర్వాత బాలీవుడ్ కు వెళ్లి పోయిన శ్రీదేవి తిరిగి మళ్ళీ రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో నటించింది. 1994, వైజయంతి మూవీస్, అశ్వినీదత్ నిర్మాణం, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో ‘గోవిందా గోవిందా’ చిత్రం విడుదలైంది. శ్రీదేవి, నాగార్జున, రామ్ గోపాల్ వర్మ, అశ్వినీదత్ లాంటి భారీ కాంబో లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద తీవ్ర పరాజయం చూసింది. దర్శకుడు రాంగోపాల్ వర్మ శ్రీదేవితో తీయాలన్న కల నెరవేరినప్పటికీ… ఆమెతో విజయవంతమైన చిత్రాలను రూపొందించలేకపోయాడు. ఈ సినిమా తర్వాత ఆరు నెలల గ్యాప్ లో శ్రీదేవి మరో తెలుగు చిత్రంలో నటించింది.

1994 అల్లు అరవింద్ నిర్మాణం, రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో ఎస్పీ పరశురామ్ చిత్రం విడుదలైంది. చిరంజీవి, శ్రీదేవి కాంబినేషన్ లో వచ్చిన జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం బ్లాక్ బస్టర్ గా నిలిచిపోయింది. సోషియో ఫాంటసీ జోనర్ లో వచ్చిన ఆ సినిమాను ఇప్పటికీ ప్రేక్షకులు మరిచిపోలేకపోతున్నారు. 1994 లో శ్రీదేవి, చిరంజీవి కాంబినేషన్ లో సినిమా అనౌన్స్ మెంట్ జరగగానే ప్రేక్షకుల్లో ఎక్కడలేని కోలాహలం మొదలైంది. 1994 జూన్ లో భారీ అంచనాల మధ్య విడుదలైన ‘ఎస్పి పరశురాం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది.

ఈ చిత్రం తర్వాత శ్రీదేవి తెలుగు చిత్రాలకు దూరమయ్యారు. ఆ తర్వాత బాలీవుడ్ లో అడపాదడపా చిత్రాలు చేసినప్పటికీ.. 2004 దశకం వచ్చేసరికి ఆమె వయసు మీద పడడం, సినిమాలు తగ్గిపోవడం లాంటివి జరిగాయి. 2004 లో ‘మేరీ బీవీ క జవాబు నహీ’ 2012లో ఇంగ్లీష్ వింగ్లీష్..చిత్రాలు శ్రీదేవికి మంచి పేరును తీసుకువచ్చాయి. దుబాయిలో పెళ్ళికి హాజరవడానికి వెళ్ళిన శ్రీదేవి ప్రమాదవశాత్తు ఆమె బస చేసిన హోటల్ బాత్ టబ్ లో పడి 2018 ఫిబ్రవరిలో మరణించారు.