జింకను ఢీ కొట్టిన వ్యక్తి కోటీశ్వరుడయ్యాడు.. ఎలా అంటే..?

అదృష్టం ఎవరిని ఎప్పుడు ఏ విధంగా వరిస్తుందో ఎవరూ చెప్పలేరు. అదృష్టం వల్ల ఓవర్ నైట్ లో కోటీశ్వరులైన వారి గురించి మనం చాలాసార్లు వినే ఉంటాం. అదే విధంగా ఒక వ్యక్తి కూడా రాత్రి జింకను ఢీ కొట్టి ఉదయానికి కోటీశ్వరుడు అయ్యాడు. వినడానికి వింతగా అనిపించిన ఈ ఘటన అమెరికాలోని నార్త్ కరోలినాలో చోటు చేసుకుంది. కొత్త కారుతో జింకను ఢీ కొట్టిన వ్యక్తికి లాటరీ తగలడంతో అతని జీవితమే మారిపోయింది.

నార్త్ కరోలినాకు చెందిన ఆంటోనీ డోవ్ కొన్ని రోజుల క్రితం కొత్త కారును కొనుగోలు చేశారు. కారులో వేగంగా వెళుతున్న సమయంలో ఆంటోని వెళుతున్న రోడ్డుపైకి జింకలు వచ్చాయి. అప్పటికే కారు వేగంగా వెళుతూ ఉండటంతో ఆంటోనీ కారును కంట్రోల్ చేయలేకపోయాడు. జింకలను ఢీ కొట్టిన సమయంలో కొత్త కారు డ్యామేజ్ అయింది. కారు బాగా డ్యామేజ్ కావడం, జింకకు గాయాలు కావడంతో ఆంటోని తీవ్ర మనోవేదనకు గురయ్యాడు.

ఇంటికి వెళ్లి కారు గురించే ఆలోచిస్తూ నిద్రపోయాడు. ఉదయం లేచిన వెంటనే అతనికి తను కొనుగోలు చేసిన టికెట్ కు లాటరీ తగిలిందని తెలిసింది. లాటరీ ద్వారా ఆంటోనీ 1 మిలియన్ డాలర్లు గెలుచుకోగా ఆ ప్రైజ్ మనీ తీసుకోవడానికి వెళ్లిన సమయంలో ఆంటోనీ మరో టికెట్ ను కూడా కొనుగోలు చేశాడు. ఆ టికెట్ కు కూడా ఫ్రైజ్ మనీ రావడంతో ఏకంగా 2 మిలియన్ డాలర్లు (భారత కరెన్సీలో 14.6 కోట్లు) అతని సొంతమయ్యాయి.

లాటరీ డబ్బుల్లో పన్నులు పోగా అతని చేతికి 10.2 కోట్ల రూపాయలు వచ్చాయి. నార్త్ కరోలినా ఎడ్యుకేషన్ లాటరీ ఈ విషయాలను వెల్లడించింది. లాటరీ ద్వారా వచ్చిన డబ్బులతో ఆంటోనీ తన కొత్త కారును రిపేర్ చేయించుకోవడంతో పాటు తన పేరెంట్స్ ఇంటికి మరమ్మత్తులు చేయిస్తానని తెలిపారు.