కరోనా సోకిన పిల్లల్లో అరుదైన వ్యాధి.. శాస్త్రవేత్తల్లో టెన్షన్..?

ప్రపంచ దేశాల్లో వేగంగా విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గురించి మరో షాకింగ్ విషయం వెలుగులోకి వచ్చింది. ఇప్పటికే ఈ మహమ్మారికి సంబంధించి ఎన్నో లక్షణాలు వెలుగులోకి రాగా తాజాగా ఈ వైరస్ బారిన పడి కోలుకున్న చిన్నారికి అరుదైన వ్యాధి సోకినట్టు వైద్యులు గుర్తించారు. ఎయిమ్స్ వైద్యులు కరోనా వల్ల ఒక చిన్నారి మెదడులోని నాడులు దెబ్బ తిన్నాయని.. ఫలితంగా ఆమె చూపు మందగించిందని తేల్చారు.

చైల్డ్ న్యూరాలజీ విభాగం శాస్త్రవేత్తలు ఈ కేసును పూర్తిస్థాయిలో స్టడీ చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా సోకిన చిన్నారుల్లో ఇలాంటి కేసు నమోదు కావడం ఇదే తొలిసారని అయితే భవిష్యత్తులో మరి కొంతమంది పిల్లల్లో సైతం ఈ సమస్య కనిపించే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మెదడులో నాడులు దెబ్బ తినే ఈ సమస్యను ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ అంటారని.. 11 సంవత్సరాల బాలికలో ఈ వ్యాధి లక్షణాలు కనిపించాయని తెలిపారు.

సాధారణంగా పెద్దలు మాత్రమే ఈ వ్యాధి బారిన పడతారని వైద్యులు వెల్లడించారు. మనిషి మెదడులో కణాలను రక్షించే మైలిన్ పొర ఉంటుందని.. శరీరంలో సమాచార మార్పిడికి ఈ పొర దోహదపడుతుందని.. ఈ వ్యాధి వల్ల బాలిక కంటిచూపు మందగించిందని తెలిపారు. డాక్టర్ గులాటీ పాపకు చికిత్స అందించి కంటిచూపు మెరుగుపడేలా చేశారు. అయితే 50 శాతం మాత్రమే కంటిచూపు మెరుగుపడిందని వైద్యులు తెలిపారు.

ఎక్యూట్ డీమైలినేటింగ్ సిండ్రోమ్ (ఏడీఎస్) అరుదైన వ్యాధి అని చెవులు, ముక్కు, నోరు, మూత్రాశయం, కండరాల కదలికలపై కూడా ఈ వ్యాధి ప్రభావం తీవ్రంగా ఉంటుందని వైద్యులు వెల్లడించారు. కరోనా మహమ్మారి గురించి వెలుగులోకి వస్తున్న వార్తలు ప్రజల్లో భయాన్ని మరింత పెంచేలా ఉండటం గమనార్హం. రోజురోజుకు వెలుగులోకి వస్తున్న కొత్త లక్షణాలు శాస్త్రవేత్తలను టెన్షన్ పెడుతున్నాయి.