సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. మృతదేహాన్ని కనిపెట్టిన పోలీసులు..

తెలంగాణలోని సైదాబాద్ ఘటనలో చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన రాజును పట్టుకోవడానికి విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. అయితే దీనిపై తాజాగా ఓ వార్త వెలుగులోకి వచ్చింది. నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం వినపడుతోంది. వివరాల్లోకి వెళ్తే.. గత కొన్ని రోజుల క్రితం హైదరాబాద్ లోని సైదాబాద్ ప్రాంతంలో ఓ ఆరేళ్ల చిన్నారి చిప్స్ ప్యాకెట్ కొనడానికి బయటకు వెళ్లగా.. ఆ చిన్నారిని బలవంతంగా తీసుకెళ్లి.. అత్యాచారం, హత్య చేశాడు రాజు అనే నిందితుడు.

అయితే ఈ ఘటనను ప్రతీ ఒక్కరూ సీరియస్ గా తీసుకున్నారు. సెలబ్రిటీల దగ్గర నుంచి రాజకీయ ప్రముఖుల వరకు తీవ్రంగా స్పందించారు. కుటుంబసభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆందోళన చెప్పట్టగా.. నిందుతుడిని పట్టుకొని న్యాయం చేస్తామంటూ పోలీసులు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇంత వరకు అతడి ఆచూకీని మాత్రం పోలీసులు కనుక్కోలేకపోయారు.

పవణ్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి , వైఎస్ షర్మిల, మంచు మనోజ్ తో పాటు ఎంతో మంది బాధిత కుటుంబసభ్యులను పరామర్శించారు. అతడిని పట్టిస్తే నజరానాలను కూడా అందజేస్తామని సీనీ ప్రముఖులు ప్రకటించారు. అయితే తాజాగా అతడు ఆత్మహత్య చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనిపై పోలీసులు అధికారికంగా ప్రకటించలేదు.

త్వరలో ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఎల్బీ నగర్ నుంచి బయలుదేరిన రాజు నాగోల్ లో మద్యం కొనుగోలు చేసినట్లు సీసీటీవీ ఫుటేజీల ద్వారా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఉప్పల్ వెళ్లాడు. అక్కడి వరకు సిసీటీవీ ఫుటేజీల ద్వారా అతని కదలికలను పోలీసులు గుర్తించారు. తర్వాత వారం రోజుల పాటు రాజు కోసం గాలించిన పోలీసులు చివరకు అతని మృతదేహాన్ని కనిపెట్టారు. ఘట్ కేసర్ రైలు పట్టాలపై పోలీసులకు అతడి మృతదేహం కనిపించింది.