Tag Archives: AP farmers

ఏపీ రైతులకు ప్రభుత్వం శుభవార్త.. సబ్సిడీ నగదు విడుదల..!

ఏపీలో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ రైతులకు మరో శుభవార్త చెప్పింది. భారీ వర్షాల వల్ల పంట దెబ్బ తినడంతో ఇబ్బందులు పడుతున్న రైతులకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకుంది. రైతుల కోసం ప్రభుత్వం 10.76 కోట్ల రూపాయలు విడుదల చేసింది. 2020 సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ నెల మధ్యలో కురిసిన భారీ వర్షాల వల్ల రాష్ట్రంలోని పలు జిల్లాల రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఆ సమయంలో వర్షాల వల్ల నష్టపోయిన రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ విడుదలైంది. 33 శాతం కంటే ఎక్కువ పంట నష్టపోయిన రైతులకు ప్రభుత్వం ఇన్ పుట్ సబ్సిడీ నగదును ఇవ్వనుంది. వ్యవసాయ శాఖ అధికారులు ఇప్పటికే నష్టపోయిన రైతుల వివరాలను, వారికి అందించాల్సిన పరిహారం వివరాలకు సంబంధించిన నివేదికను తయారు చేశారు. ఈ సంవత్సరం ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో 7,757 హెక్టార్లల్లో పంట నష్టానికి సబ్సిడీ విడుదలైంది.

ప్రభుత్వం విడుదల చేసిన నగదును 17,872 మంది నష్టపోయిన రైతులకు అధికారులు ఇవ్వనున్నారు. మరోవైపు జగన్ సర్కార్ ఈ నెల 27వ తేదీన రాష్ట్రంలోని రైతులకు రైతు భరోసా నగదును విడుదల చేయడానికి సిద్ధమవుతోంది. రైతుల ఖాతాలలో 4,000 రూపాయల చొప్పున ప్రభుత్వం జమ చేయనుందని తెలుస్తోంది. ప్రభుత్వం పెట్టుబడి సాయంగా ఈ నగదును రైతులకు ఇస్తోంది.

జగన్ సర్కార్ ప్రతి సంత్సరం రైతు భరోసా పథకం ద్వారా 13,500 రూపాయల నగదు ఇవ్వనుండగా ఇందులో కేంద్రం వాటా 6,000 రూపాయలు, రాష్ట్రం వాటా 7,500 రూపాయలుగా ఉంది. ప్రభుత్వం ఆర్థిక కష్టాలు ఉన్నా పథకాలను అమలు చేస్తూ ఉండటంపై రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.