ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2019 సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా అమలు చేస్తూ ప్రజలకు ప్రజా సంక్షేమ పాలన సాగిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా జగన్ సర్కార్ కరోనా, లాక్ డౌన్ వల్ల ఇబ్బందులు పడుతున్న వీధి వ్యాపారులను దృష్టిలో ఉంచుకుని జగనన్న తోడు స్కీమ్ ను అమలు చేస్తోంది. ఈ స్కీమ్ ద్వారా వీధివ్యాపారులకు 10,000 రూపాయలు అందించింది.
అయితే కొందరు జగనన్న తోడు పథకానికి అర్హులైనా 10,000 రూపాయలు పొందలేదని సీఎం జగన్ దృష్టికి వచ్చింది. దీంతో సీఎం జగన్ 10,000 రూపాయలు అందని వాళ్లకు ప్రయోజనం చేకూర్చేలా కీలక నిర్ణయం తీసుకున్నారు. అర్హులై లబ్ధి పొందలేని చిరు వ్యాపారులు మరోసారి ఈ స్కీమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చని వెల్లడించారు. ప్రభుత్వం ఇప్పటికే ఈ స్కీమ్ లబ్ధిదారుల జాబితాను గ్రామ, వార్డ్ సచివాలయాలలో పొందుపరిచింది.
సహాయం, ఫిర్యాదుల కొరకు 1902 నంబర్ కు కాల్ చేయమని అధికారులు సూచించారు. జగన్ సర్కార్ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ నిర్ణయాల ద్వారా ప్రయోజనం చేకూర్చాలని భావిస్తోంది. ఎవరైతే అర్హత ఉండి దరఖాస్తు చేస్తారో వాళ్లకు నెలరోజుల్లో ఖాతాల్లో నగదు జమ చేయడానికి సిద్ధమవుతోంది. అర్హులైన చిరువ్యాపారులు వడ్డీ లేని రుణాలను పొందవచ్చు.
చిరు వ్యాపారులకు ఆర్థిక భరోసా కల్పించాలనే ముఖ్య ఉద్దేశంతో జగన్ సర్కార్ ఈ స్కీమ్ ను అమలు చేస్తూ ఉండటం గమనార్హం. జగన్ సర్కార్ ఈ పథకం అమలు చేయడంపై చిరువ్యాపారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ పథకం అమలు ద్వారా తమకు ప్రయోజనం చేకూరుతోందని చెబుతున్నారు.