Tag Archives: raksha bandhan 2021

అక్క కోసం కిడ్నీ త్యాగం చేసిన తమ్ముడు.. నిజమైన రక్షా బంధన్‌కు అర్ధం చెప్పిన అక్కతమ్ముడు!

అన్నా చెల్లెలు అనుబంధానికి గుర్తుగా రక్షా బంధన్ ను జరుపుకుంటారు. సోదరీమణులు తమ సోదరుల మణికట్టుకు రాఖీలు కడతారు. అన్నకు చెల్లి అండగా, చెల్లికి అన్న తోడుగా జీవితాంతం ఉంటామని భరోసా ఇచ్చే ఈ పండుగను కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పూర్ణిమ అని కూడా అంటారు. అన్నా చెల్లెళ్ళు , అక్కా తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలకు ప్రతీకగా జరుపుకునే పండుగనే రాఖీ పండుగ. నేడు ఈ పండుగను జరుపుకోనున్నారు. ఇదిలా ఉండగా ఓ వ్యక్తి రక్షా బంధన్‌కు నిజమైన అర్థం చెప్పాడు. ప్రాణాప్రాయ స్థితిలో ఉన్న తన అక్కను రక్షించుకున్నాడు.

తన కిడ్నీని దానం చేసి ఆమె జీవితంలో వెలుగులు నింపాడు. ఈ ఘటన హర్యానాలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. హర్యానాలోని రోహ్ తక్ కు చెందిన ఓ 31 ఏళ్ల మహిళ గత ఐదు సంవత్సరాల నుంచి కిడ్నీ వ్యాధితో బాధపడుతోంది. చాలా రోజుల నుంచి వైద్యుల పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటోంది. అయితే ఆమెకు రక్త పోటు కూడా ఉండటంతో పరిస్థితి విషమించిందని ఆకాశ్ హెల్త్‌కేర్ వైద్యులు తెలిపారు. ఆమెకు మొదట ఆరోగ్యంపై అశ్రద్ధ వహించడంతో ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె అవయవాలపై కూడా ప్రభావాన్ని చూపించినట్లు తెలిపారు. వెంటనే ఆమెకు డయాలసిస్ నిర్వహించడంతో.. ఆమె మంచి ఆహారం తీసుకోవడం ప్రారంభించిందన్నారు. ఇది కాస్త ఆమె ఆరోగ్యం మెరుగుపడటానికి దారితీసింది.

దీంతో ఆమె వయస్సును పరిగణలోకి తీసుకొని కుటుంబసభ్యులకు కిడ్నీ మార్పిడి చేయాలని సూచించారు. వైద్యులు కిడ్నీ దానం చేసే వ్యక్తి కోసం ప్రయత్నాలు ప్రారంభించారు. కానీ ఆ మహిళ కుటుంబసభ్యులే కిడ్నీ దానం చేయడానికి ముందుకు వచ్చారు. మొదట ఆమె భర్త కిడ్నీ ఇచ్చేందుకు ముందుకు రాగా.. అతడి బ్లడ్ గ్రూప్ సరిపోలేదు. ఆమె 28 ఏళ్ల తమ్ముడి బ్లడ్ గ్రూప్ సరిపోవడంతో అతడు కిడ్నీ దానం చేయడానికి రెడీ అయ్యాడు. దీంతో వైద్యులు అతడికి వైద్య పరీక్షలు నిర్వహించి ఐదు గంటల సుదీర్ఘ శస్త్ర చికిత్స చేసి కిడ్నీ మార్పిడి పూర్తి చేశామని వైద్యులు తెలిపారు. దీంతో ఆమె కుటుంబసభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. దీనిపై వైద్యులు స్పందిస్తూ.. ‘ఆమె యువ వివాహిత మాదిరిగా సాధారణ జీవితాన్ని గడపవచ్చు. ఆమె కోరుకున్న సమయంలో తల్లి కావచ్చు’అని తెలిపారు.

కిడ్నీ దానం చేసిన వ్యక్తి మాట్లాడుతూ.. కిడ్నీ వ్యాధితో తన అక్క చాలా బాధపడిందని.. ఆమె బాధను చూడలేక తాము తట్టుకోలేకపోయామని .. వైద్యులు తన కిడ్నీ సరిపోతుందని చెప్పగానే ఒక్క క్షణం కూడా ఆలోచించలేదని అన్నాడు. ఇక నుంచి తన అక్క సంతోషంగా ఉంటుందని.. అంతకంటే ఏం కావాలి అంటూ ఆమె సోదరుడు భావోద్వేగానికి గురయ్యాడు. అయితే రాఖీ పండుగ నేపథ్యంలో ఇలా తన కిడ్నీని దానం చేయడంతో నెటిజన్లు రాఖీ పండుగకు నిజమైన అర్థం ఇచ్చారంటూ ప్రశంసించారు.

నేడు రాఖీ పండుగ.. ఈ రోజు సోదరులు ఏం చేయాలి.. వాటి విశిష్టత ఏమిటి!

ప్రేమ, అనుబంధం, సోదర-సోదరీ భావానికి నిదర్శనం రాఖీ పండుగ. ప్రస్తుతం ఈ పండుగను ప్రపంచవ్యాప్తంగా భారతీయులు జరుపుకుంటున్నారు. నేడు (ఆగస్టు 22)న దేశ వ్యాప్తంగా అక్కాచెల్లెళ్లు ఎంతో కనుల పండుగగా జరుపుకోనున్నారు. మన జీవితంలో ఎన్నో బంధాలు ఉండొచ్చు… కానీ సోదర.. సోదరీమణులకు మధ్య ఉండే బంధం చాలా స్పెషల్. ఎన్ని గొడవలు, వాగ్వాదాలు పెట్టుకున్నప్పటికీ చివరికీ ఇద్దరూ ఒక్కటై పోతారు. చెల్లి ఆపదలో ఉందంటే.. ముందుగా గుర్తుకు వచ్చేది అన్న మాత్రమే. తమ్ముడికి ఇబ్బంది వస్తే అక్క కంగారు పడుతుంది. అలాంటి ప్రత్యేక బంధం ఇది. వీరు ఒకరిపై మరొకరి ప్రేమను తెలుపుకోవడానికి వీలైన పండగ వేదిక రక్షాబంధన్. ఈ రాఖీ పౌర్ణమి ఒకప్పుడు ఉత్తర, పశ్చిమ భారతదేశాలలోని ప్రజలు మాత్రమే అపూర్వంగా జరుపుకునే ఈ పండుగను ఇప్పుడు దేశవ్యాప్తంగా చాలా ఘనంగా జరుపుకుంటున్నారు.

తన సోదరుడు ఎన్నో శిఖరాలను అధిరోహించాలని.. మంచి గుర్తింపు తెచ్చుకోవాలని ప్రతీ సోదరి కోరుకుంటుంది. అయితే ఇంతటి విశిష్టత ఉన్న రాఖీ పండుగను ఎందుకు జరుపుకుంటారంటే.. ఈ పండగ మొత్తం రెండు పదాలతో కూడుకున్నది. ఒకటి రక్షణ.. మరొకటి బంధనం. సంస్కృతం ప్రకారం చూసుకున్నట్లయితే ఈ పండుగని ముడితో రక్షణ ఇవ్వమని అర్థం. రక్షణ అంటే రక్షణ కలిగించడం బంధం అంటే కట్టుకోవడం. అలానే ఇది కేవలం సోదరి సోదరుడు మాత్రమే జరుపుకొనే పండుగ కాదు. మరదలు, చెల్లెలు, కజిన్స్ ఇలా ఎవరైనా సరే సెలబ్రేట్ చేసుకోవచ్చు. వీటికి పురాణాల్లో చాలా కథలే ఉన్నాయి. సమాజంలో మానవతా విలువలు మంటకలిసిపోతున్న నేపథ్యంలో రాఖీ పౌర్ణమి వంటి పండుగలు జరుపుకోవాల్సిన అవసరం కూడా ఉంది.

రాఖీ పండుగ రోజున ఉదయాన్నే తలస్నానం చేసి కొత్తబట్టలు వేసుకొని.. రాఖీ కట్టడానికి సిద్ధమవుతారు.. సోదరీమణులు. అన్న లేదా తమ్ముడు కూడా సోదరీమణులు కట్టిన రాఖీలను స్వీకరించి తమకు తోచిన సహాయాన్ని ఇస్తుంటారు. “యేన బద్ధో బలీ రాజా దానవేంద్రో మహాబలః తేన త్వామభి బద్నామి రక్ష మాచల మాచల” అనే శ్లోకాన్ని చదివి రాఖీ కడతారు సోదరీమణులు. తరువాత స్వీట్స్ తినిపిస్తారు. నిండు నూరేళ్లు సుఖంగా జీవించమని దీవిస్తారు. ఈ సంవత్సరం రాఖీలకు గిరాఖీ బాగా పెరిగింది. బంగారం, వెండి రాఖీలు కూడా మార్కెట్లో సరికొత్త డిజైన్లతో సందడి చేస్తున్నాయి.

రాఖీ పండుగ రోజు సోదరుడు సోదరి తప్పనిసరిగా అన్నదానం చేస్తే మంచి జురుగుతుందని నమ్మకం. ఇలా చేసేవారికి ఆర్థికంగా ఎలాంటి కష్టాలు రావని చెబుతుంటారు. ఈ రోజు చంద్రుడితో సహా నవగ్రహాలను పూజిస్తే దోషాలు పోతాయని కూడా చెబుతుంటారు. రక్షా బంధన్ నాడు సోదరీ సోదరులకు రాఖీ కట్టడం సోదరుడు తిరిగి ఏదైనా బహుమతి ఇవ్వడం తరతరాలుగా చూస్తున్నాం. ఈ సంవత్సరం కూడా ఆచారం ప్రకారం రక్షా బంధన్ జరుపుకుని ఆనందంగా ఆరోగ్యంగా ఉండండి. ఎప్పుడూ అక్కా తమ్ముడు, అన్నాచెల్లెళ్లు చక్కగా ఒకరికొకరు తోడుగా.. నీడగా.. నిలవాలని ‘తెలుగు డెస్క్’ కోరుకుంటోంది.