ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలుకు ప్రథమ ప్రాధాన్యత ఇస్తున్న సంగతి తెలిసిందే. సీఎం జగన్ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలతో పాటు ఇవ్వని హామీలను కూడా నెరవేరుస్తూ ప్రశంసలు అందుకుంటున్నారు. కరోనా, లాక్ డౌన్ వల్ల రాష్ట్ర ప్రభుత్వం ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నా పథకాల అమలు విషయంలో మాత్రం జగన్ ఏ మాత్రం వెనక్కు తగ్గడం లేదు.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటీఅరా మినహా మిగిలిన అన్ని హామీలను జగన్ ఇప్పటికే నెరవేర్చారు. జగన్ సర్కార్ అర్హత ఉండి పథకాలలో పేరు రాకపోతే వాళ్లకు మళ్లీ దరఖాస్తు చేసే అవకాశం కల్పిస్తూ రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ లబ్ధి చేకూరేలా చేస్తోంది. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాల వల్ల గత ప్రభుత్వాలకు భిన్నంగా సంక్షేమ పథకాల ఫలాలు అందుతున్నాయని రాష్ట్ర ప్రజానీకం అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
తాజాగా జగన్ సర్కార్ వైఎస్సార్ కాపు నేస్తం రెండో విడత అమలుకు సిద్ధమవుతోంది. కొందరు వైఎస్సార్ కాపునేస్తం స్కీమ్ కు అర్హులైనా వివిధ కారణాల వల్ల ఈ పథకానికి అర్హత పొందలేదు. దీంతో ప్రభుత్వం కొత్తగా కాపు నేస్తంలో చేరిన లబ్ధిదారులకు ఖాతాలలో 15 వేల రూపాయల చొప్పున నగదు జమ చేసింది. కాపు కులంలో వెనుకబడిన వారిని ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా ఆదుకోనుంది.
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలకు అనుగుణంగా జగన్ సర్కార్ కాపుల కోసం ప్రతి సంవత్సరం 2,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తోంది. 45 నుంచి 60 సంవత్సరాల మద్య వయస్సు ఉన్న కాపు, బలిజ, ఒంటరి, తెలగ వర్గాల మహిళలు ఈ పథకం ద్వారా ప్రయోజనం పొందవచ్చు.