Tag Archives: writes letter to speaker

మూడు ఛానెళ్లకు జగన్ సర్కార్ షాక్.. అసెంబ్లీలోకి నో ఎంట్రీ..?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నేటి నుంచి అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అధికారంలో వున్న వైసీపీ ఐదు రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని భావిస్తోంటే ప్రతిపక్షంలో ఉన్న టీడీపీ మాత్రం పదిరోజుల పాటు అసెంబ్లీ సమావేశాలను నిర్వహిస్తే బాగుంటుందని అభిప్రాయం వ్యక్తం చేస్తోంది. అయితే జగన్ సర్కార్ అసెంబ్లీలోకి రావడానికి కొన్ని మీడియా ఛానెళ్లకు అనుమతులు ఇవ్వలేదు.

జగన్ సర్కార్ అనుమతులు ఇవ్వని మూడు మీడియా ఛానెళ్లు చంద్రబాబు అనుకూల మీడియా ఛానెళ్లు కావడం గమనార్హం. మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు స్పీకర్ తమ్మినేని సీతారంకు ఇప్పటికే ఆంక్షలు విధించిన మీడియా ఛానెళ్లకు అనుమతులు ఇవ్వాలని స్పీకర్ కు లేఖ రాశారు. ఈ లేఖ విషయంలో స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాల్సి ఉంది.

టీడీపీ ప్రజాస్వామ్యంలో పధాన భాగస్వామి మీడియా అని అలాంటి మీడియాపై ఆంక్షలు విధించడం సరికాదని చెబుతోంది. జగన్ సర్కార్ గతంలో జీవో నంబర్ 2430 ద్వారా ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాస్తే మీడియా ఛానెళ్లపై చర్యలు తీసుకోవాలని ఆదేశించిందని.. ఈ జీవోపై రాష్ట్ర మీడియాతో జాతీయ మీడియాలో సైతం వ్యతిరేకత వచ్చిందని తెలిపింది. చట్టసభల్లోకి మీడియాను నిషేధించడం దారుణమైన చర్యగా టీడీపీ అభివర్ణించింది.

అధికార పక్షం, ప్రతిపక్షం వ్యవహారశైలిని మీడియా నిష్పక్షపాతంగా ప్రజలకు చేరవేస్తుందని.. మీడియాపై ఆంక్షలను ప్రజాస్వామిక విలువలను అణగదొక్కటంగా భావిస్తున్నట్టు చంద్రబాబు చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా జగన్ సర్కార్ వ్యవహరిస్తోందని చంద్రబాబు పేర్కొన్నారు.