సీఎం జగన్ పై టిడిపి నేత అనురాధ ఫైర్!

ఏపీ సీఎం జగన్ పై నిప్పులు చెరిగారు టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనూరాధ. గతంలో నేతన్నలకు రూ.50వేలకు పైబడి పథకాలు, సబ్సిడీలు అందేవన్నారు. సీఎం జగన్ వాటిని రద్దు చేసి.. నేతన్న నేస్తం పేరుతో రూ. 24వేలు అందిస్తూ చేనేత కార్మికులను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్రవ్యాప్తంగా 3.50 లక్షల మందికి పైగా చేనేత కార్మికులు ఉంటే.. కేవలం 80 వేల మందికి సహాయం అందుతుందని పేర్కొన్నారు.

జగన్ ప్రభుత్వం నేతన్న నేస్తం పేరుతో హడావుడి చేసి ప్రజలను పక్కదారి పట్టిస్తుందని అనురాధ ఆరోపించారు. చేనేత రంగానికి ఊతమివ్వాలంటే.. పని చేసే వారిని ప్రోత్సహించాలని సూచించారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో ఇచ్చిన సాయాన్ని పునరుద్ధరించి చేనేత కార్మికులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.