దొంగలుగా మారిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజ్‌ వీడియో వైరల్..

దొంగలను పట్టుకొని వాళ్లకు బుద్ది చెప్పాల్సిన పోలీసులే దొంగలుగా మారి దోచుకుంటున్నారు. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లాలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చిత్తూరు లోని కలెక్టరేట్ కు వెళ్లే దారిలో రోడ్డు పక్కన రెండు బట్టల దుకాణాలున్నాయి. రోజంతా వ్యాపారం చేసి రాత్రిళ్లు బట్టలన్నీ మూట కట్టేస్తారు.

కొన్నిసార్లు లోపలే ఏర్పాటు చేసుకున్న మంచంలో పడుకుంటారు ఆ వ్యాపారస్తులు. మరికొన్నిసార్లు దుకాణాన్ని పట్టాలతో మూసేసి పోలీసులు పెట్రోలింగ్ చేస్తుంటారనే నమ్మకంతో ఇళ్లకు వెళ్లిపోతారు. ఇలాగే ఓ రోజు షాపు మూసేసి ఓ యజమాని ఇంటికి వెళ్లిపోయాడు. ముందే విషయం తెలుసుకున్నారో… అప్పటికప్పుడు షాపులో ఎవరూ లేని విషయాన్ని గమనించారో.. ఇద్దరు పోలీసులు షాపు బయట స్కూటర్ ఆపి లోపలికి వచ్చారు.

అందులో ఒకరు పోలీస్ యూనిఫాంలో ఉండగా.. మరొకరు సివిల్ డ్రస్ లో ఉన్నారు. అక్కడ ఉన్న బండిలోని ఓ మూట ఓపెన్ చేసి అందులో కొన్ని దుస్తులను చోరీ చేసి అక్కడ నుంచి వెళ్లిపోయారు. తెల్లారి వచ్చి తన దుకాణం తెరిచి చూశాడు ఆ బట్టల దుకాణం యజమాని. ఒక మూటలో బట్టలు తక్కువగా ఉండటాన్ని గమనించి చోరీ జరిగినట్లు గ్రహించాడు.

దీంతో తన షాప్ లోనే ఏర్పాటు చేసిన సీసీటీవీ ఫుటేజ్ ఓపెన్ చేసి చూడగా.. పోలీసులే దొంగతనం చేసినట్లు తెలిసింది. దొంగతనం జరిగిన ఆరు రోజుల తర్వాత సీసీ కెమెరా వీడియో బయటపడింది. వీడియో ఆధారంగా పోలీసులకు ఫిర్యాదు చేశాడు షాపు యజమాని. షాపులోకి వెళ్లి బట్టలు తీసుకున్నది ఏఆర్ కానిస్టేబుల్ అని.. బయట కాపలాగా సివిల్ డ్రెస్ లో ఉన్న మరో పోలీసు ఏఆర్ ఏఎస్ఐ అని తెలిసింది. ఈ విషయం తెలుసుకున్న ప్రజలు పోలీసులే ఇలాంటి పనులకు పాల్పడితే సామాన్య ప్రజలకు ఇక రక్షణ ఎలా ఉంటుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.