ఒకే కుటుంబంలో నలుగురి బలవన్మరణం.. ఆకలితో చిన్నారి కన్నుమూత..

ఏదైనా క్రైమ్ ఘటన జరిగినప్పుడు ఒక శవాన్ని చూస్తేనే గుండెలు అదురుతాయి. అలాంటిది ఒకే ఇంట్లో ఐదుగురు శవాలు కనిపించాయి. అందులో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకోగా.. దానిలో 9 నెలల బాబు మాత్రం ఆకలితో చనిపోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటన బెంగళూరు నగరం బైడరహల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

బైడరహల్లి ప్రాంతానికి చెందిన శంకర్, భారతి దంపతులు. అతడు జర్నలిస్టుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. ఇంట్లో ఏదో చిన్న గొడవ కారణంగా అతడు ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఇంట్లో వాళ్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదు. తర్వాత మూడు రోజుల తర్వాత తన ఇంటికి వచ్చి తలుపు తట్టాడు. భారతి.. భారతి అని పిలిచినా ఎలాంటి స్పందన లేదు.

కిటికీలు,డోర్లు అన్ని లాక్ చేసి ఉండటంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వాళ్ల సహాయంతో బలవంతంగా తలుపు బద్దలు కొట్టి లోపలకి వెళ్లి చూశాడు. అక్కడ ఆ ఘటన చూసి షాక్ అయ్యాడు. అతడికి ఇద్దరు కూతుళ్లు, ఇద్దరు కొడుకులు. అందులో 9 నెలల కొడుకు కూడా ఉన్నాడు. వాళ్లంతా ఆ ఇంట్లో విగతజీవులా పడి ఉన్నారు. ఈ విషయంపై సమాచారం అందుకున్న పశ్చిమ డీసీసీ సంజీవ్ పాటిల్ సంఘటనా స్థలాన్ని సందర్శించారు.

ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్నీ కోణాల్లో దర్యాప్తు చేపట్టనున్నట్లు తెలిపారు. శంకర్ కు ఇద్దరి కూతుళ్లలో ఒక కూతురు పేరు సించన. ఆమెకు పెళ్లి చేశారు. తన భర్తతో విభేదాల కారణంగా ఇంటికి వచ్చి ఇక్కడే ఉంటోంది. ఈ వ్యవహారంలో అతడు ఇంటి నుంచి బయటకు వెళ్లగా.. ఇలా ఘోర ఘటన జరిగినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.