స్టార్ రైటర్‌గా క్రేజ్.. డైరెక్టర్‌గా డెబ్యూ సినిమా ఫ్లాప్.. పాపం మళ్ళీ ఛాన్సే రాలేదు..!

సినిమా ఇండస్ట్రీలో సినిమాటోగ్రాఫర్ డైరెక్టర్స్‌గా మారిన వారెందరో ఉన్నారు. అలాగే రచయితలుగా పాపులర్ అయినవారు ఆ తర్వాత దర్శకులుగా మారారు. హీరోలు కూడా దర్శకులుగా మారి సినిమాలని డైరెక్ట్ చేసిన వారు..ఎం.ఎస్.రాజు లాంటి అగ్ర నిర్మాత దర్శకుడయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఐతే వీరిలో అందరూ సక్సెస్ కావడం లేదు. దర్శకుడిగా ఒక్క సక్సెస్ వచ్చాక మళ్ళీ అవకాశం రానివారు కొందరైతే..అసలు ఒక్క సినిమా కూడా హిట్ కాకపోవడంతో మళ్ళీ దర్శకుడిగా అవకాశాలు రాక ఇబ్బందులు పడుతున్నవారూ ఉన్నారు.

అలాంటి వారిలో ప్రముఖ రచయిత వక్కంతం వంశీ ఉన్నారు. వక్కంతం వంశీ ముందు టీవీ రంగంలో సీరీయల్స్‌కి వర్క్ చేశారు. ఆ తర్వాత రచయితగా మారి సూపర్ హిట్ సినిమాలకు కథలు అందించారు. వక్కంతం వంశీ ఎక్కువగా అసోసియేట్ అయి కథలు అందించింది స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డితో. వీరిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన సినిమాలు  ఎక్కువ శాతం భారీ కమర్షియల్ సక్సెస్‌లనే అందుకున్నాయి. వక్కంతం వంశీ అందించిన కథలతో సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఎన్.టి.ఆర్, అల్లు అర్జున్, రాం చరణ్, రవితేజ లాంటి వారు సినిమాలు చేసి భారీ హిట్స్ అందుకున్నారు.

కలుసుకోవాలని అనే సినిమాతో కథా రచయితగా మారిన వక్కంతం వంశీ.. ఆ తరువాత సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఎన్.టి.ఆర్ హీరోగా నటించిన అశోక్ సినిమాకు కథ అందించాడు. ఈ సినిమా హిట్ టాక్ తెచ్చుకుంది. ఆ తర్వాత అతిథి, కిక్ సినిమాలకు కథ  అందించాడు. ఈ సినిమాలలో మహేశ్ బాబు నటించిన అతిథి సినిమా ఫ్లాపవగా, కిక్ మాత్రం బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. ఇక ఊసరవెల్లి, ఎవడు, రేసుగుర్రం, కిక్ 2, టెంపర్, టచ్ చేసి చూడు, లాంటి సినిమాలకు కథ అందించాడు. ఈ సినిమాలలో కొన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తే కొన్ని మాత్రం ఫ్లాపయ్యాయి.

అయితే ఇన్ని కథలను అందించిన వక్కంతం వంశీ దర్శకుడవ్వాలనుకున్నాడు. అందుకే నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా కథ తయారు చేసుకొని అల్లు అర్జున్‌కి చెప్పాడు. కథ బాగా నచ్చడంతో అల్లు అర్జున్ వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. సినిమా బాగానే ఉన్నప్పటికీ ఫ్లాప్ సినిమాగా మిగిలింది. మేకింగ్ పరంగా అల్లు అర్జున్ మేకోవర్ పరంగా మంచి ప్రశంసలు దక్కాయి. దర్శకుడిగానూ వక్కంతం వంశీకి మంచి పేరే వచ్చింది. అయితే ఈ సినిమా ఆశించిన సక్సెస్ అందుకోకపోవడంతో మళ్ళీ వక్కంతం వంశీకి దర్శకుడిగా అవకాశం దక్కలేదు.

ఆ మధ్యన నితిన్ హీరోగా వక్కంతం వంశీ డైరెక్షన్‌లో సినిమా వస్తుందని వార్తలు వచ్చాయి. కానీ ఇప్పటివరకు దీనికి సంబంధించిన కన్‌ఫర్మేషన్ రాలేదు. ప్రస్తుతం సురేందర్ రెడ్డి దర్శకత్వంలో అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న ఏజెంట్ సినిమాకు కథ అందిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మళ్ళీ దర్శకుడిగా ట్రై చేస్తాడేమో చూడాలి. ఏదేమైనా వక్కంతం వంశీలో మంచి రచయిత మాత్రమే కాదు మంచి దర్శకుడూ ఉన్నాడు. కాకపోతే డైరెక్టర్‌గా ఓ భారీ హిట్ దక్కాలంతే..