మహేష్ బాబుతో మొదటి సినిమా చేసిన హీరోయిన్‌కి బ్యాడ్ లక్ వెంటాడుతుందా..?

సూపర్ స్టార్ కృష్ణ నట వారసుడిగా టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలోకి బాల నటుడుగా ఎంట్రీ ఇచ్చి దర్శకేంద్రుడు కె రాఘవేంద్ర రావు తెరకెక్కించిన రాజకుమారుడు ద్వారా హీరోగా మారి ప్రస్తుతం సూపర్ స్టార్ గా ఓ వెలుగు వెలుగుతున్నాడు మహేష్ బాబు. కథలు ఎంచుకోవడంలో..  దర్శక, నిర్మాతల పట్ల తండ్రికి తగ్గ తనయుడిగా మహేష్ పేరు తెచ్చుకున్నాడు. సినిమా, ఫ్యామిలీ, సమాజ సేవ.. ఇలా మూడు బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వర్తిస్తున్నాడు మహేష్. ఎక్కువగా సక్సెస్ లలో ఉన్న దర్శకులతోనే పని చేస్తాడు.. వారికే అవకాశాలిస్తాడని మహేష్ బాబు మీద కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా వరుస హిట్స్ తో మంచి ఫాం లో ఉన్నాడు.

ఇక తండ్రి మాదిరిగానే ఇండస్ట్రీకి తన సినిమాల ద్వారా కొత్త హీరోయిన్స్ ని కూడా పరిచయం చేశాడు. అయితే మహేష్ బాబుతో మొదటి సినిమా చేసి ఇండస్ట్రీకి పరిచయమైన చాలా మందికి ఇండస్ట్రీలో హీరోయిన్ గా లైఫ్ ఉండదనే కొన్ని మాటలు బాగా వినిపించాయి. ఆ మాటలను బట్టి చూస్తే నిజంగానే మహేష్ బాబుతో మొదటి సినిమా చేసిన కొంతమంది హీరోయిన్స్ మళ్ళీ టాలీవుడ్ లో కనిపించకుండా పోయారు.

మహేష్ బాబు నటించిన అతిథి సినిమా ద్వారా అమృతారావు టాలీవుడ్ కి పరిచయం అయింది. ఈ సినిమా 2007లో వచ్చి ఫ్లాప్ సినిమాగా మిగిలింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో అమృతా రావు బాగానే నటించింది. కానీ ఆమెకి ఇదే తెలుగులో మొదటి మరియు చివరి సినిమా. బాలీవుడ్‌లో వివాహ్ అనే సినిమా చేసి బాగా క్రేజ్ రావడంతో మహేష్ బాబు అవకాశం ఇచ్చాడు. కానీ మళ్ళీ తెలుగులో కనిపించలేదు.

ఇక జయంత్ సి పరాన్‌జి దర్శకత్వంలో నటించి కౌ బాయ్ సినిమా టక్కరి దొంగ. ఈ సినిమా కూడా ఫ్లాప్ అయింది. ఇక దీని ద్వారా బిపాస బసు, లిసారే హీరోయిన్స్‌గా పరిచయం అయ్యారు. కానీ తెలుగులో వీరికి రెండవ సినిమా లేకుండా పోయింది. అయితే బిపాస బసు బాలీవుడ్ ల మాత్రం స్టార్ హీరోయిన్ గా వెలిగింది.

ఇక మహేష్ సతీమణి నమ్రత కూడా 2000 సంవత్సరంలో వచ్చిన వంశీ సినిమా ద్వారా పరిచయం అయింది. కానీ మెగాస్టార్ తో అంజి తప్ప మళ్ళీ సినిమాలు చేయలేదు. అయితే మహేష్ ని పెళ్ళి చేసుకున్నాకే ఈమె సినిమాలకి దూరమయ్యారు.

ఇక సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన సినిమా 1 నేనొక్కడినే. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన కృతి సనన్ హీరోయిన్‌గా నటించింది. ఈమెకి ఈ సినిమానే తెలుగులో మొదటి సినిమా. ఈ సినిమా కూడా ఫ్లాప్ సినిమానే. ఆ తర్వాత అక్కినేని నాగ చైతన్య సరసన దోచేయ్ అనే సినిమా చేసింది. కానీ ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా పడింది.

ఇలా మహేష్ తో తెలుగులో డెబ్యూ సినిమా చేసిన కొందరు హీరోయిన్స్ టాలీవుడ్ లో సత్తా చాటలేకపోయరు. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన భరత్ అనే నేను సినిమాతో టాలీవుడ్ లో అడుగుపెట్టి మొదటి సినిమాతో భారీ హిట్ అందుకున్న కియారా అద్వానీ .. ఆ తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ సరసన వినయ విధేయ రామ చేసింది. ఈ సినిమా ఫ్లాపవడంతో మళ్ళీ టాలీవుడ్ లో నటించలేదు. కానీ ఈమె ప్రస్తుతం బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్. కాగా ఇటీవల శంకర్ – చరణ్ సినిమాలో హీరోయిన్‌గా ఎంపికైంది. దీనిబట్టి చూస్తే మహేష్ తో మొదటి సినిమా చేసిన హీరోయిన్ టాలీవుడ్ లో రాణించింది లేదనే చెప్పాలి.