పిల్లలు ఆరోగ్యంగా పెరగాలంటే ఈ ఆహారం తప్పనిసరి..!

ప్రస్తుతం ఉన్న ఈ పోటీ ప్రపంచంలో తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగాల రీత్యా ఆఫీసులకు వెళ్లటం వల్ల ఇంట్లో వంటలు చేయడం కుదరక తొందరగా ఫాస్ట్ ఫుడ్ తయారుచేసి పెట్టడం వల్ల పిల్లలు ఎన్నో సమస్యలకు గురవుతున్నారు. అందువల్ల చిన్న పిల్లలు ఎక్కువగా పోషకాహారం తినడానికి పెద్దగా ఇష్టం చూపించడం లేదు. ఎక్కువగా జంక్ ఫుడ్ తీసుకోవటం వల్ల వారిలో పోషకాహారలోపం ఏర్పడుతుంది. ఈ పోషకాహార లోపం వల్ల పిల్లల్లో అనేక సమస్యలు తలెత్తుతాయి.

పిల్లలలో శారీరక ఎదుగుదల ఆగిపోవడంతో పాటు, ఎటువంటి పనులను చేయడానికి కూడా ఆసక్తిని కనబరచరు. పిల్లలను పోషకాహార లోపం నుంచి కాపాడాలి అంటే వారికి సరైన పోషక పదార్థాలు కలిగిన ఆహారాన్ని సరైన సమయంలో తినిపించడం ద్వారా శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. పిల్లలలో శారీరక ఎదుగుదల ఉండాలంటే ఏ సమయంలో ఎలాంటి ఆహార పదార్థాలను తినిపించాలి అనే విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.

చిన్నపిల్లల ప్రతిరోజు ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయాలి. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే వారికి రోజంతా ఎంతో నీరసంగా అలసిపోయి ఉండటంవల్ల ఎలాంటి పనులను చేయడానికి ఆసక్తి చూపించరు. అందుకోసమే ఉదయం బ్రేక్ ఫాస్ట్ గా ఇడ్లీ, దోసే, ఉప్మా వంటి వాటిని తినిపించాలి. అలాగే స్కూల్ కి వెళ్ళే పిల్లలు స్కూల్ కి వెళ్లే సమయంలో ఒక గ్లాసు పాలు తాగడం వల్ల రోజంతా ఎంతో చురుగ్గా ఉంటారు. అలాగే మధ్యాహ్న సమయంలో అన్నంతో పాటు తాజా కూరగాయలు పప్పు దినుసుల తో చేసిన కూరలతో కలిపి అన్నం తినిపించాలి.

సాయంత్రం ఒక గ్లాసు పాలను తాపించాలి. ఒకవేళ పాలు తాగడానికి ఇష్టపడని పిల్లలకు రాగి మాల్ట్ చేసి తాగించవచ్చు. అదేవిధంగా సాయంత్రం స్నాక్స్ గా శనగపప్పు గుగ్గిళ్ళు, మరమరాలు, ఉడికించిన వేరుశనగ గింజలు మొదలైన వాటిని తినిపించాలి. అదేవిధంగా రాత్రి పడుకోవడానికి మూడు గంటల ముందు భోజనం తినిపించాలి. రాత్రి భోజనంలో అన్నంతో పాటు కూరలను లేదా చపాతి వంటి వాటిని తినిపించాలి. అదేవిధంగా పడుకునే ముందు ఏదైనా ఒక పండును కచ్చితంగా తినేలా చూసుకోవాలి ఈ విధమైన ఆహారపు అలవాట్లను చేయడం ద్వారా పిల్లలలో శారీరక ఎదుగుదలతో పాటు మానసిక ఎదుగుదల కూడా ఉంటుంది. పిల్లలను వీలైనంతవరకు చిరుతిళ్ళకు అలవాటు చేయడం మానేయాలి.