యువతిపై నలుగురు యువకుల సామూహిక అత్యాచారం.. ఆసుపత్రి గదిలోనే దారుణంగా..

నిజామాబాద్‌లో దారుణ ఘటన జరిగింది. యువతిపై నలుగురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. యువతి చేత బలవంతంగా మద్యం తాగించి.. ఆమె స్పృహ కోల్పోయాక బస్టాండ్ సమీపంలోని ఓ ఆస్పత్రి గదిలోకి తీసుకువెళ్లి ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. దీనిపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చి.. బాధితురాలిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను పోలీసులు ఇలా తెలిపారు.

దేశంలో హత్యలు, అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కఠిన చట్టాలు ఉన్నా.. ఉరి శిక్షలు పడుతున్నా.. కామాంధుల్లో మాత్రం మార్పు రావడం లేదు. ఒకానొక సందర్భాల్లో ఎన్ కౌంటర్ చేస్తున్నా చలనం లేకుండా ప్రవర్తిస్తున్నారు. వాయివరుసుల మరిచి మరీ తల్లి, సోదరి అన్న తేడా లేకుండా వ్యవహరిస్తున్నారు. సైదాబాద్ సింగరేణి కాలనీలో చిన్నారిపై హత్యాచార ఘటన మరవక ముందే నిజామాబాద్ లో ఈ ఘటన చోటుచేసుకుది.

పట్టణంలో ఓ ప్రవేట్ ఆసుపత్రిలో ఓ యువతి చికిత్స నిమిత్తం ఆసుపత్రికి వెళ్లింది. అక్కడ ఆమెపై నలుగురు కామాంధులు కన్నేశారు. ఆ ఆసుపత్రిలోనే ఆమెను బలవంతంగా ఓ రూంకి తీసుకెళ్లి సామూహిక అత్యాచారం చేశారు. ఆ యువతి అరుపులు, కేకలు విన్న సెక్యూరిటీ సిబ్బంది గదిలోకి వెళ్లి చూశారు. ఆమెపై అత్యాచారం జరిగిందని గుర్తించి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.

పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి.. ఆమెకు బలవంతంగా మద్యం తాపించి.. సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నిందితుల కోసం గాలిస్తున్నారు.