సర్జరీ చేయించుకున్న మహేశ్ బాబు.. ‘సర్కారు వారి పాట’ షూటింగ్ కు బ్రేక్..!

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబుకు సర్జరీ అయింది. గత కొన్ని రోజులుగా మెకాలినొప్పితో బాధపడుతున్న ఆయనకు స్పెయిన్ లో ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ విశ్రాంతి తీసుకుంటున్నారు. అతడితో పాటు మహేశ్ సతీమణి నమ్రతా కూడా ఉన్నట్లు సమాచారం. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో కూడా అతడు వెల్లడించారు.

త్వరలో తాను సర్జరీకి వెళ్తున్నానని అందుకే ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ కు బ్రేక్ ఇచ్చానని చెప్పాడు. ఈ నాలుగు రోజులు కుటుంబంతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలని నిర్ణయించుకున్నట్లు కూడా తెలిపాడు. అంతేకాదు.. తన సినిమాలను మొదట కుటుంబసభ్యులతో కలిసి చూస్తానని.. సినిమాలో ఫైట్ సీన్లంటే తన కూతురుకు ఇష్టం ఉండదని.. అటువంటి సమయంలో ఆమె అక్కడ నుంచి లేచి వెళ్లిపోతుందని అని కూడా చెప్పాడు.

ఇక ప్రస్తుతం అతడికి సర్జరీ పూర్తయినట్లు వార్తలు వస్తున్నాయి. మహేష్ పూర్తిగా కోలుకున్న తర్వాత మిగతా షూటింగ్ లో పాల్గొంటారని తెలుస్తోంది. సర్కారు వారి పాట సినిమాకు పరశురాం దర్శకత్వం వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో మహేశ్ కు జోడీగా కీర్తి సురేష్ నటిస్తోంది.

ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, వీడియోలు సినిమాపై అంచనాలను పెంచాయి. దాదాపు ఈ సినిమా షూటింగ్ పూర్తయిందని.. ఇంకా ముఖ్యమైన కొన్ని సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందని మూవీ సభ్యులు తెలుపుతున్నారు. ఈ సినిమా తర్వాత మహేశ్ రాజమౌళి దర్శకత్వంలో ఓ సినిమాలో నటించనున్నారు.