కరోనా మహమ్మారి గురించి ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!

దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ఇతర దేశాలతో పోల్చి చూస్తే భారత్ లో కరోనా మహమ్మారి విజృంభణ ఎక్కువగా ఉంది. ఈరోజు ప్రధాని నరేంద్ర మోదీ జాతినుద్దేశించి ప్రసంగిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. కరోనా మహమ్మారికి వ్యాక్సిన్ వచ్చేంత వరకు పోరాటం తప్పదని చెప్పారు. దేశంలో లాక్ డౌన్ పోయినా కరోనా వైరస్ ముప్పు మాత్రం పోలేదని కామెంట్లు చేశారు. భారత్ మహమ్మారిపై పోరాటం చేస్తుందని.. దేశంలో రికవరీ రేటు బాగుందని మోదీ అన్నారు.

ప్రజలు కరోనా నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని బయటకు వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలని చెప్పారు. దేశంలో 2 వేల ల్యాబులు కరోనా పరీక్షల కోసం పని చేస్తున్నాయని తెలిపారు. మరికొన్ని రోజుల్లో పండుగలు రాబోతున్నాయని.. దీంతో ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అన్నారు. ఒక మిలియన్ జనాభాలో 5,500 మంది కి వైరస్ నిర్ధారణ అయిందని మోదీ పేర్కొన్నారు.

దేశంలో కరోనా పరీక్షల సంఖ్య త్వరలో పది కోట్లు దాటబోతుందని మోదీ అన్నారు. వైద్య వ్యవస్థ ఎక్కువ సంఖ్యలో పరీక్షలు చేయడం కోసం ఎంతో కృషి చేస్తోందని అన్నారు. నర్సులు, వైద్య సిబ్బంది, వైద్యులు సేవా భావంతో కరోనా వైరస్ చికిత్స కోసం పని చేశారని చెప్పారు. వైరస్ తగ్గుముఖం పట్టిందని భావిస్తే భవిష్యత్తులో తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.

వ్యాక్సిన్ కోసం వేగంగా ప్రయత్నాలు జరుగుతున్నాయని.. రాత్రీపగలు శాస్త్రవేత్తలు వ్యాక్సిన్ కోసం ప్రయోగాలు చేస్తున్నారని.. దేశంలో చివరి వ్యక్తికి వ్యాక్సిన్ అందే వరకు ప్రభుత్వం కృషి చేస్తుందని.. నిర్లక్ష్యం చేస్తే జీవితాలు ప్రమాదాలు పడతాయని తెలిపారు.