మహేష్ తో తెలంగాణ పోలీస్.. బీ అలెర్ట్..!!

ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి ఏ విధంగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. రోజు రోజుకి కేసుల సంఖ్యపెరిగిపోతూ వస్తోంది.. ఇలాంటి నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించే బాధ్యతను పోలీసులు భుజానకెత్తుకున్నారు. ఎవరితో చెప్పిస్తే బాగా ప్రజల్లోకి వెళుతుందో వారితేనే చెప్పిస్తున్నారు. ముఖ్యంగా క్రేజ్ ఉన్న సినీ తారల వీడియోలు, వాయిస్ లతో తెలంగాణ పోలీసులు కరోనాపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు.

దేశంలో ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా కొనసాగుతోంది.ఈ మహమ్మారి వ్యాప్తికి కళ్లెం వేసేందుకు అన్ని ప్రభుత్వాలు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నాయి. మాస్క్ ధరించడం.. భౌతిక దూరం పాటించడం సహా కోవిడ్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విజ్ఞప్తి చేస్తున్నాయి.ఈ క్రమంలోనే తెలంగాణ పోలీసులు ప్రజలకు కరోనా అవగాహన కల్పించేందుకు మహేష్ బాబును వాడుకున్నారు. ఆయన డైలాగులతో వినూత్న ప్రచారం మొదలు పెట్టారు.

మహేష్ బాబు మాస్క్ ధరించి ఉన్న ఓ ఫొటోతో ప్రత్యేక వీడియోను తయారు చేసి సోషల్ మీడియాలో వదిలారు. మాస్క్, కరోనా రక్షణ నిబంధనలను వివరించే ప్రయత్నం చేస్తున్నారు.’జీవితం అనేది ఒక యుద్ధం.. దేవుడు మనల్ని వార్ జోన్ లో పడేశాడు.. అప్రమత్తంగా ఉండండి.. మిమ్మల్ని మీరు రక్షించుకోండి’ అని మహేష్ బాబు చెప్పిన సినిమా డైలాగులను ఈ వీడియోలో జొప్పించారు. అవగాహన కల్పించేలా ఉండడంతో దీన్ని నెటిజన్లు షేర్లు, కామెంట్లు చేస్తూ హోరెత్తిస్తున్నారు..

ఇక మహేష్ సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం పరశురాం దర్శకత్వంలో సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్నాడు.. ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది.. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమా తాజాగా కరోనా వల్ల మళ్ళీ ఆగిపోయింది..ఇప్పటికే రెండు భారీ షెడ్యూల్స్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దర్శకనిర్మాతలు..!!