జయలలిత, జమున మధ్య ఆ కారణం వల్ల గొడవ జరిగిందనే సంగతి మీకు తెలుసా?

అలనాటి అందాల తారలు, నటీమణులు అయిన జయలలిత, జమున అందచందాలు, నటనా నైపుణ్యం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ప్రేక్షకాదరణ పొందిన ఈ నటీమణులు ఇద్దరూ ఎక్కువ ఆత్మాభిమానం కలవారు. ఆత్మాభిమాన విషయంలో ఈ ఇద్దరు తొందరగా రాజీపడరని చెప్పవచ్చు.ఈ ఆత్మ అభిమానం కారణంగానే జయలలిత హీరోయిన్ గా గొప్ప స్థాయిలో ఉన్నప్పుడు స్టార్ హీరోలైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ సినిమాలలో నటించే అవకాశాలను కొంతకాలం పాటు వదులుకున్నారని చెప్పవచ్చు.

ఈ విధంగా ఎంతో ఆత్మాభిమానం ఉన్న ఈ స్టార్ హీరోయిన్లు ఇద్దరి మధ్య ఓసారి పెద్ద గొడవ జరిగింది. ఆ గొడవ కారణంగా కొన్ని సంవత్సరాల పాటు దూరమయ్యారు. కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో కౌముది ఆర్ట్ పిక్చర్స్ బ్యానర్‌పై మల్లెమాల సుందరరామిరెడ్డి నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం “శ్రీకృష్ణ విజయం”. ఈ సినిమాలో నందమూరి తారక రామారావు కృష్ణుడి పాత్రను పోషించారు.

ఈ సినిమాలో వసుంధర పాత్రలో జయలలిత, సత్యభామ పాత్రలో జమున నటించారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో భాగంగా డైరెక్టర్ కామేశ్వరరావు వీరిద్దరికీ డైలాగ్ ఇచ్చి రిహార్సల్స్ చేయమన్నారు. ఇందులో మొదటగా జయలలిత చెప్పిన డైలాగ్ జమున తిరిగి సమాధానం చెప్పాలి. ఈ క్రమంలోనే జమున డైలాగ్ చెప్పండి అంటూ జయలలితను అడగగా అందుకు జయలలిత నేనెందుకు చెబుతాను.. మీరే చెప్పుకోండి అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో జమున ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ క్రమంలోనే దర్శకుడితో జమున ఏంటండీ ఇది… ఆ అమ్మాయి డైలాగ్ చెప్పకపోతే నేనెలా రిహార్సల్స్ చేయాలి అంటూ అనగా అందుకు డైరెక్టర్ ఏ సమాధానం చెప్పలేదు. అదేవిధంగా దర్శకనిర్మాతలు జమునకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. అయితే ఆరోజు వారిద్దరు సర్ది చెప్పడం వల్ల షూటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత కొంతకాలం వరకు వీరిద్దరి మధ్య మాటలు లేవని, ఆ తర్వాత వారిద్దరి మధ్య స్నేహం కొనసాగిందని ఓ ఇంటర్వ్యూ సందర్భంగా జమున తెలియజేశారు.