నటి శిల్పాశెట్టికి మరొక షాక్.. ఆమె తల్లిపై చీటింగ్ కేసు నమోదు.. ఎందుకో తెలుసా..

బాలీవుడ్‌ నటి శిల్పాశెట్టి భర్త రాజ్‌ కుంద్రా పోర్నోగ్రఫీ కేసులో పోలీసులు అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా తాజాగా శిల్పాశెట్టికి మరొక షాక్ తగిలింది. ఆమె తల్లి సునందపై చీటింగ్‌ కేసు నమోదైంది. లక్నోలోని రెండు పోలీసు స్టేషన్‌లో ఆమెపై చీటింగ్‌ కేసులు నమోదయ్యాయి. అయోసిస్‌ వెల్‌నెస్‌ అండ్‌ స్పా పేరుతో శిల్పాశెట్టి ఓ ఫిట్‌నెస్ సెంటర్‌ ను నిర్వహిస్తోంది. దీనికి ఆమె చైర్మన్‌ గా, ఆమె తల్లి సునంద డైరెక్టర్‌ గా ఉన్నారు.

మరో బ్రాంచ్‌ ను లక్నోలో ఈ ఫిట్‌నెస్ సెంటర్ ను ప్రారంభించేందుకు జ్యోత్స్న చౌహాన్, రోహిత్ వీర్ సింగ్ అనే ఇద్దరి నుంచి కోట్ల రూపాయలు తీసుకున్నారు. అయితే ఆ తర్వాత వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో శిల్పా, ఆమె తల్లి సునందలు తమ వద్ద డబ్బులు తీసుకుని మోసం​ చేశారంటూ బాధితులు పోలీసులను ఆశ్రయించారు.

బాధితులు వీరిద్దరిపై లక్నోలోని హజరత్ గంజ్, విభూతి ఖండ్ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు రెండు బృందాలుగా ఎర్పడి విచారణ చేపట్టారు. ఈ రెండు బృందాలకు డీసీపీ సంజీవ్‌ సుమన్‌ అధికారిగా ఉన్నారు. ఇప్పటికే శిల్పాను, ఆమె తల్లిని విచారించేందుకు ఒక బృందంతో డీసీపీ ముంబై చేరుకున్నారు.

ఈ వ్యవహారంపై డీసీసీ సంజీవ్‌ సుమన్‌ మాట్లాడుతూ.. ఈ విషయం ఉన్నత స్థాయికి చేరిందని, అందువల్ల పోలీసులు అన్ని అంశాలను నిశితంగా పరిశీలిస్తున్నారని ఆయన తెలిపారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకున్న తర్వాత తదుపరి చర్యలు తీసుకుంటామని తెలిపారు.