ఏపీ మహిళలకు మరో శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?

ఏపీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన రోజు నుంచి రాష్ట్రంలోని మహిళల సంక్షేమం కోసం కీలక నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా సీఎం జగన్ రాష్ట్రంలోని మహిళలకు మరో శుభవార్త చెప్పారు. జగన్ సర్కార్ రాష్ట్రంలోని మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా ఇప్పటికే ప్రయోజనం కల్పిస్తుండగా ప్రభుత్వం చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళలకు పాడి పశువులు కొనుగోలు చేసి పంపిణీ చేయాలని భావిస్తోంది.

ఇప్పటికే పశువులు ఉన్న మహిళల నుంచి పాలను అమూల్ ద్వారా కొనుగోలు చేసి, మంచి ధర ఇచ్చి ప్రయోజనం చేకూరేలా చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ప్రభుత్వం రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మహిళలకు వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా 18,750 రూపాయలు బ్యాంకు ఖాతాలలో జమ చేసిన సంగతి తెలిసిందే. ఈ నగదుతో ఏదైనా చిన్న వ్యాపారం చేయాలనుకున్నా, పాడి పశువుల ద్వారా స్థిరపడాలన్నా ప్రభుత్వం తమ వంతు సహాయం చేస్తోంది.

వైఎస్సార్ చేయూత స్కీమ్ ద్వారా లబ్ధి పొందిన మహిళల నుంచి ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా 4.90 లక్షల మంది మహిళలు ఈ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందడానికి దరఖాస్తు చేసుకున్నారు. వీళ్లలో కొందరు ఇప్పటికే పాడి పశువులు ఉన్నవాళ్లు కాగా మరికొందరు కొత్తగా పాడి పశువుల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వం మొత్తం 5.63 లక్షల పాడి పశువులను కొనుగోలు చేస్తోంది.

జగన్ సర్కార్ రాష్ట్రంలో పాల సేకరణ కేంద్రాలను, బల్క్ మిల్క్ కూలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనుంది. బల్క్‌ మిల్క్‌ కూలింగ్‌ యూనిట్‌ కోసం జగన్ సర్కార్ 11 లక్షల రూపాయలు ఖర్చు చేయనుండగా పాల సేకరణ కేంద్రం కోసం 4 లక్షల రూపాయలు ఖర్చు చేయనుంది.