Producer Ashok Kumar : ఈశ్వర్ ఫస్ట్ సినిమా పోస్టర్ చూడగానే ఎన్టీఆర్ మాటలు ఇప్పటికీ మర్చిపోలేను… విలన్, నిర్మాత అశోక్ కుమార్

Producer Ashok Kumar : విలక్షణ నటుడుగా, విలన్ గా, నిర్మాతగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకున్నారు కె. అశోక్ కుమార్. విక్టరీ వెంకటేష్ నటించిన ‘రక్త తిలకం’ అనే సినిమాతో నిర్మాతగా పరిచయం అయ్యారు. మొదటి సినిమాతోనే హిట్ నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. తరువాత కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ సినిమాతో నటుడుగా పరిచయం అయ్యారు. నిర్మాతగా ‘రక్త తిలకం’, ‘ధృవ నక్షత్రం’, ‘చెవిలో పువ్వు’, ‘ప్రేమంటే ఇదేరా’, ‘ఈశ్వర్’ ‘జయదేవ్’ వంటి హిట్ సినిమాలను అందించారు.

ఇక ఒసేయ్ రాములమ్మ సినిమాల్లో చేసిన విలన్ రోల్ అశోక్ కుమార్ కు స్టార్ డమ్ తెచ్చిపెట్టింది. అశోక్ కుమార్ కి స్వయానా దగ్గుబాటి రామానాయుడు గారు మేనమామ అవ్వడం విశేషం. ఆయన స్ఫూర్తి తోనే నిర్మాతగా పరిచయం అయ్యారు. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న అశోక్ తాను నిర్మించిన ఈశ్వర్ సినిమా గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పారు.

ఎన్టీఆర్ చెప్పిన మాటలు జీవితంలో మర్చిపోలేను…

నిర్మాత గా తెలుగులో ఎన్నో హిట్ సినిమాలు నిర్మించిన అశోక్ కుమార్ ఈశ్వర్ సినిమా ద్వారా రెబల్ స్టార్ ప్రభాస్ ని హీరో గా పరిచయం చేశారు. ప్రభాస్ కు మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు కూడా లభించింది. అసలు ఈశ్వర్ సినిమాకు ప్రభాస్ ను ఎలా ఎంపిక చేసుకున్నారు, ఆ సినిమా విశేషాల గురించి అశోక్ చెప్పారు. మొదట దర్శకుడు అశోక్ వాళ్ల అబ్బాయిని హీరోగా పెడదాం అనుకున్నా, అశోక్ ఆ సలహాను సున్నితంగా తిరస్కరించి హీరో కోసం వెతికారట. అయితే మరో నిర్మాత కే. సి. శేఖర్ బాబు సలహా మీద కృష్ణం రాజు గారిని సంప్రదించడం ప్రభాస్ ను హీరోగా ఫిక్స్ అవ్వడం జరిగిపోయిందట.

అయితే ఈశ్వర్ సినిమా ఫస్ట్ పోస్టర్ ను ఎన్టీఆర్ కి చూపిస్తే చాలా బాగుంది బాబాయ్(అశోక్) ఇండస్ట్రీ కి ఒక మంచి హీరోని తీస్తున్నారు అని చెప్పారట. ఎటువంటి ఇగో లేకుండా అందరికీ మంచి హిట్లు రావాలి, ఎదగాలి అని ఎన్టీఆర్ కోరుకోవడం ఇప్పటికీ నేను మర్చిపోలేను అని చెప్పుకొచ్చారు. అంతే కాకుండా సినిమా ప్రమోషన్ కోసం కూడా ఎన్టీఆర్ వచ్చారని చెప్పారు.