మా అధ్యక్ష భవనం విక్రయించడంపై వాళ్లనే అడగండి: నాగబాబు

మా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన వ్యవహారం మొదలైన దగ్గర నుంచి ప్రతీ రోజు ఏదో ఒక వాగ్వాదం జరుగుతూనే ఉంది. ఒకరిపై ఒకరు విమర్శలు కురిపిస్తూనే ఉన్నారు. తాజాగా మా బిల్డింగ్ పై మోహన్ బాబు వ్యాఖ్యలకు నాగబాబు ఇచ్చిన కౌంటర్ ఇప్పుడు వైరల్ అవుతోంది. పోటీలో ఉన్న అభ్యర్థులు అనూహ్యంగా తప్పుకోవడం, తెరపైకి మరికొందరి పేర్లు రావడంతో ఎన్నికలు ఇంకా రసవత్తరంగా మారాయి.

అధ్యక్ష ఎన్నికల బరిలో నిలిచిన మంచు విష్ణు సొంత డబ్బులతో బిల్డింగ్ నిర్మిస్తానని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఈ ఎన్నికలు మొత్తం మా బిల్డింగ్‌ చుట్టూనే తిరుగుతున్నాయి. దీనిపై మోహన్ బాబు- నాగబాబు మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్‌ ఎన్నికలు ఎప్పుడు నిర్వహించాలనే దానిపై చర్చిస్తూ క్రమశిక్షణ సంఘం అధ్యక్షుడు కృష్ణంరాజు నేతృత్వంలో గత నెలలో జూమ్‌ మీటింగ్‌ జరిగింది.

పలువురు సభ్యులు అందులో పాల్గొన్నారు. మీటింగ్‌లో భాగంగా మాట్లాడిన మోహన్‌బాబు ఎక్కువ ధరకు భవనాన్ని కొనుగోలు చేసి అతి తక్కువ ధరకే దానిని ఎందుకు అమ్మేశారు..? సినిమా పెద్దలు అప్పుడు ఎందుకని పెదవి విప్పలేదు అని ప్రశ్నించారు.

దీనిపై నాగబాబు స్పందిస్తూ.. 2017 లో అధ్యక్షుడిగా ఉన్న శివాజీ రాజా.. సెక్రటరీగా ఉన్న నరేశ్ నే దీనిపై అడిగి సమాధానం రాబట్టుకోవాలని నాగబాబు అన్నారు. బిల్డింగ్‌ అమ్మకం వ్యవహారమంతా నరేశ్‌-శివాజీరాజాలకే తెలుసని అన్నారు. భవనం అమ్మకం గురించి నరేశ్‌నే ప్రశ్నించాలన్నారు.