వరుడు రెండో ఎక్కం చెప్పలేదని షాకిచ్చిన వధువు.. పెళ్లిపీటలపైనే?

సాధారణంగా పెళ్లి పీటల పై ఒక పెళ్లి ఆగింది అంటే అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. కట్నకానుకల విషయంలో, లేదా వరుడు ఇంకొక అమ్మాయిని ఇష్టపడటం, వధువు వేరే అబ్బాయిని ఇష్టపడటం, లేదంటే వధూవరులకు ఇష్టం లేకుండా పెళ్లి చేయడం వంటివి చేస్తున్న సమయాలలో కొన్ని పెళ్లిళ్లు పీటలపై ఆగిపోవడం మనం చూస్తుంటాము. కానీ పెళ్లి కొడుకు ఎక్కాలు చెప్పలేదని పెళ్లి ఆగిపోవడం ఎప్పుడైనా విన్నారా. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఈ విచిత్రమైన ఘటన ఉత్తర ప్రదేశ్ లో చోటు చేసుకుంది.

ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన విద్యావంతురాలైన యువతికి మహోబా జిల్లాలోని ధవార్ గ్రామానికి చెందిన ఓ యువకుడితో పెళ్ళి నిశ్చయించారు. ఈ క్రమంలోనే శనివారం సాయంత్రం వివాహ వేడుకలు ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలోనే పెళ్లి పీటల పై ఉన్న వరుడు పురోహితులు చెబుతున్న మంత్రాలను సరిగ్గా పలకకపోవడంతో వధువుకు అనుమానం వచ్చి ఎంతవరకు చదువుకున్నావ్ అంటూ వరుడిని ప్రశ్నించింది. అందుకు వరుడు తడబడటంతో ఆమెకు మరింత అనుమానం కలిగింది.

తనను చేసుకోబోయే యువకుడు చదువుకోలేదని సందేహం రావడంతో వధువు తనకు రెండవ ఎక్కాం అప్పజెప్పాలని చెప్పింది. వరుడు రెండవ ఎక్కం చెప్పకపోవడంతో, కనీసం రెండో ఎక్కం కూడా చెప్పడం రాని వాడిని ఏ విధంగా పెళ్లి చేసుకోవాలని భావించి ఈ పెళ్లి చేసుకోవడానికి నిరాకరించింది. అప్పటికే బంధువులందరూ ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేసిన ఆమె ఈ పెళ్ళికి ససేమిరా అంది.

వరుడిని పెళ్లి చేసుకోనని పెళ్లి పీటల మీద నుంచి వెళ్లిపోవడంతో బంధువులు అందరూ షాక్ అయ్యారు.పెళ్లి కూతురు ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకోవడంతో ఆమె తీసుకున్న నిర్ణయం కూడా సరైనది అని భావించిన కుటుంబ సభ్యులు ఈ పెళ్లిని రద్దు చేశారు. ప్రస్తుతం ఈ పెళ్లి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.