BRS : బీఆర్ఎస్ శ్రేణులు అనుకున్నట్లుగానే అంతా జరిగిపోయింది. కొద్దిరోజులుగా పార్టీకి వ్యతిరేకంగా కార్యకలాపాలు సాగిస్తున్న కీలక నేతలు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, జూపల్లి శ్రీనివాసులకు ఊహించని రీతిలోనే సీఎం కేసీఆర్ షాకిచ్చారు. సోమవారం ఉదయం ఈ ఇద్దర్నీ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తున్నట్లు కేసీఆర్ ఆదేశాల మేరకు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. అయితే ఈ ఇద్దరి దారెటు..? రానున్న ఎన్నికల్లో ఇండిపెండెంట్లుగా బరిలోకి దిగుతారా..? లేకుంటే కాంగ్రెస్, బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా..? అన్నది ఇప్పుడు వీరి అభిమానులు, అనుచరుల్లో మెదులుతున్న మిలియన్ డాలర్ల ప్రశ్న. ఇంతకీ ఈ ఇద్దరి దారెటు..? వీరిద్దరూ జాతీయ పార్టీకి టచ్లో ఉన్నారా..? లేకుంటే ప్రాంతీయ పార్టీలో చేరుతారా..? అనే విషయాలపై ప్రత్యేక కథనం.
పొంగులేటి పరిస్థితి ఇదీ..!
ఖమ్మం జిల్లాకు చెందిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి బడా కాంట్రాక్టర్. తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో కూడా ఈయన కాంట్రాక్ట్ వర్క్లు చేస్తుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే కోటీశ్వరుడు, మంచి మనసున్న వ్యక్తి అని చెప్పుకోవచ్చు. రాజకీయాల్లోకి రావాలన్న కాంక్షతో ప్రస్తుత ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని సంప్రదించి వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఆ తర్వాత అసలు తెలంగాణలో ఎక్కడా పెద్దగా లేని వైసీపీ తరఫున పోటీచేసి ఖమ్మం ఎంపీగా గెలిచారు. ఆయనతో మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా గెలిపించుకున్నారు. బహుశా ఈ ముగ్గురి గెలుపును అభ్యర్థులు కూడా కలలో కూడా ఊహించి ఉండరేమో. నాటి నుంచి నేటి వరకూ వైఎస్ ఫ్యామిలీ అంటే ఎంతో ఇష్టం.. జగన్కు అత్యంత ఆప్తుడు, ఆత్మీయుడిగా మారిపోయారు. ఇప్పుడు తెలంగాణలో పార్టీ లేకపోయినప్పటికీ జగన్తో అదే సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారు.
ఏపీలో జగన్ పార్టీ అధికారంలోకి వచ్చాక చాలా కాంట్రాక్టు పనులు కూడా పొంగులేటికి కట్టెబెట్టారు. ఆ తర్వాత వైసీపీకి గుడ్ బై చెప్పి.. జగన్ అనుమతితోనే బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. అయితే గత ఎన్నికల్లో ఈయన్ను కాదని ఖమ్మం ఎంపీ టికెట్ నామా నాగేశ్వరరావుకు కేసీఆర్ ఇచ్చారు. దీంతో నాటి నుంచే పొంగులేటి తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. తర్వాత అయినా తనకు ప్రాధాన్యత ఉండే పదవి ఇస్తారని పొంగులేటి చాలా రోజులుగా ఎదురు చూస్తూనే ఉన్నారు. సీన్ కట్ చేస్తే ఇప్పటి వరకూ అసలు పొంగులేటిని పట్టించుకోక పోగా.. జిల్లా నేతలతో బీఆర్ఎస్ తిట్టించే పరిస్థితి వచ్చింది. దీంతో ఆయన బీఆర్ఎస్ రెబల్గా మారిపోయారు. అప్పట్నుంచి ఇక కేసీఆర్ వ్యతిరేక గళం వినిపిస్తూ.. పార్టీ మారకుండానే తానేంటో, తన బలమేంటో పార్టీకి తెలియాలని ఆత్మీయ సమ్మేళనం నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. అంతేకాదు రానున్న ఎన్నికల్లో ఫలానా నియోజకవర్గం నుంచి ఇదిగో వీళ్లే పోటీచేస్తారని కొన్ని స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటిస్తూ వెళ్లారు. ఇదే సమావేశాల్లో కేసీఆర్ సర్కార్పై దుమ్మెత్తిపోశారు..
అంతకుమించి కేసీఆర్కే సవాళ్లు విసిరారు కూడా. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారు..? ఏ పార్టీ తరఫున పోటీ చేస్తారనే విషయం మాత్రం చాలా చాలా గోప్యంగా ఉంచుతున్నారు. అయితే వైఎస్ ఫ్యామిలీ ప్రాడెక్ట్ కాబట్టి కచ్చితంగా YSRTPలో చేరొచ్చని మొదట వార్తలు వచ్చాయి. ఆ తర్వాత ఒకట్రెండుసార్లు ఆ పార్టీ అధినేత వైఎస్ షర్మిల, వైఎస్సార్ సతీమణి విజయమ్మతో భేటీ కావడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఇవన్నీ జరిగి నెలలు గడుస్తున్నా ఇంతవరకూ పొంగులేటి మాత్రం ఏ నిర్ణయమూ తీసుకోకుండా మిన్నకున్నారు. అయితే షర్మిల, విజయమ్మ మాత్రం తమ కుటుంబ సభ్యుడు మా పార్టీలోకే వస్తారని భావిస్తున్నారు. ఇదే జరిగితే ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బే. ఈ మధ్య ఎందుకోఈయన బీజేపీ తీర్థం పుచ్చుకునే ఛాన్స్ ఎక్కువగా ఉందని అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉన్నారు.
జూపల్లి పరిస్థితి ఇదీ..!
జూపల్లి కూడా బడా కాంట్రాక్టర్.. రాజకీయాలంటే ఆసక్తితో అరంగేట్రం చేసిన ఆయన తెలంగాణ ఉద్యమం ముందు వరకూ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ కేసీఆర్ పిలుపు మేరకు బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పటి వరకూ మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్ నుంచి ఐదుసార్లు గెలిచిన నేత. వైఎస్సార్, కిరణ్ కుమార్ రెడ్డి హయాంలో మంత్రిగా కూడా పనిచేసిన అనుభవం ఉంది. ప్రత్యేక రాష్ట్రం రావడంతో ఈయన సీనియార్టీని గుర్తించిన కేసీఆర్.. తన కేబినెట్లోకి తీసుకుని కీలక శాఖ అయిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ కట్టబెట్టారు. ఎమ్మెల్యేగా, మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో పరుగులు పెట్టించారు. అయితే 2018లో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుంచి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి బీరం హర్షవర్ధన్ చేతిలో ఓటమిని చవిచూశారు. అయితే బీరం కూడా కాంగ్రెస్కు గుడ్ బై చెప్పేసి కారెక్కడంతో జూపల్లికి నియోజకవర్గంలో కష్టాలు మొదలయ్యాయి. అప్పట్నుంచి ఒకే ఓరలో రెండు కత్తులు అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయి. పైగా ఈయన బీఆర్ఎస్లో చేరిన తర్వాత అధిష్ఠానం కూడా జూపల్లిని పెద్దగా పట్టించుకోలేదనే అభిప్రాయాన్ని ఆయన అభిమానులు, అనుచరులు చెప్పుకుంటూ ఉంటారు.
ఆ మధ్య కారు దిగి కమలం పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరగ్గా.. మంత్రి కేటీఆరే స్వయంగా జూపల్లి ఇంటికెళ్లడంతో అవన్నీ రూమర్స్ అని తేలిపోయింది.. ఆ వార్తలకు పూర్తిగా చెక్ పడినట్లయ్యింది. ఇన్ని జరుగుతున్నా ఎక్కడా తన కేడర్ను పోగొట్టుకోకుండా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహిస్తూ, కార్యకర్తలను కడుపులో పెట్టుకుంటూ చూసుకుంటూ వచ్చారు జూపల్లి. పార్టీ మారాల్సి వస్తే అందర్నీ అడిగే నిర్ణయం తీసుకుంటానని చెప్పుకుంటూ వచ్చారు. సీన్ కట్ చేస్తే.. ఇటీవల ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో పొంగులేటి ఏర్పాటుచేసిన ఆత్మీయ సమ్మేళనంలో జూపల్లి ప్రత్యక్షమయ్యారు. ఇదే సభావేదికగా కేసీఆర్ సర్కార్ తీవ్ర దుమారం రేపేలా కామెంట్స్ చేశారు. దీని ఫలితం మరుసటి రోజే పొంగులేటి, జూపల్లి ఇద్దర్నీ పార్టీ సస్పెండ్ చేసేసింది. ఇప్పుడు జూపల్లి పరిస్థితి ఏంటి..? అనేది ప్రశ్నార్థకంగా మారింది.
ఇదే బెస్ట్ ఏమో..!
ఈ ఇద్దరూ ఇద్దరే.. పొంగులేటి ఖమ్మంలో తిరుగులేని నేత కాగా, జూపల్లి మహబూబ్ నగర్ జిల్లాలో సీనియర్ నేతగా పేరుంది. వాస్తవానికి ఈ ఇద్దరికీ దగ్గర సంబంధాలేమీ లేకపోయినప్పటికీ పార్టీపై అసంతృప్తితో ఒక్కటయ్యారంతే. ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి బీజేపీ తీర్థం పుచ్చుకుంటారా లేకుంటే వైఎస్సార్టీపీ కండువా కప్పుకుంటారా అనేది తెలంగాణ రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అయితే ఇద్దరూ షర్మిల పార్టీలో చేరితేనే మంచిదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే ఏమీ లేనప్పుడే ఖమ్మం ఎంపీగా పొంగులేటిని గెలిపించారంటే ఇప్పుడు పరిస్థితుల్లో మరోసారి కచ్చితంగా గెలవడమే కాకుండా రెండు, మూడు అసెంబ్లీ స్థానాలను గెలిపించుకునే ఛాన్స్ ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇక జూపల్లి కాంగ్రెస్ నుంచి అది కూడా వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన నేత కాబట్టి వైఎస్సార్టీపీలో చేరి.. వైఎస్ కార్డుతో గెలవచ్చని రాజకీయ ఉద్ధండులు చెబుతున్నారు. అయితే మరోవైపు బీజేపీ నుంచి ఆహ్వానాలు వస్తుండటంతో ఇద్దరూ ఆలోచనలో పడ్డారట. ఫైనల్గా ఈ ఇద్దరి ఏ కండువా కప్పుకుంటారో.. ఏంటో తెలియాంటే మరో రెండు, మూడ్రోజులు వేచి చూడాల్సిందే మరి.
ప్రఖ్యాత సంగీత దర్శకుడు ఇళయరాజా కు సంబంధించి కాపీరైట్ వివాదం మరోసారి వార్తల్లో నిలిచింది. 1976 నుంచి 2001 మధ్య…
హైదరాబాద్ నగరంలో మరో దారుణ ఘటన వెలుగుచూసింది. కుటుంబ వివాదాలు ఎంతటి విషాదానికి దారి తీస్తాయో చూపించే సంఘటనగా ఇది…
దేశంలో రోజురోజుకు పెరుగుతున్న రోడ్డు ప్రమాదాల నేపథ్యంలో గాయపడిన వారికి తక్షణ వైద్య సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం కీలక…
బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణంపై ఆసక్తి నెలకొంది. ఒకవైపు ఉదయాన్నే చల్లని గాలులు తాకుతుండగా, మధ్యాహ్నానికి…
ఉద్యోగులు ప్రతీ నెల జీతం నుంచి కొంత మొత్తం పీఎఫ్గా కట్ అవుతుందని తెలుసు. కానీ ఆ డబ్బు నిజంగా…
ఇంటి ఖర్చుల్లో పెద్ద భాగం బియ్యం, పప్పులపైనే ఉంటుంది. చాలా కుటుంబాలు నెలలకు, కొందరు ఏడాదికే సరిపడా సరుకును ఒకేసారి…