రోగనిరోధక శక్తిని పెంచే పైనాపిల్ కూర.. ఎలా చేయాలో తెలుసా?

ప్రస్తుతం కరోనా పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రతి ఒక్కరు వారి శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే విటమిన్-సి అధికంగా లభించే పండ్లు, కూరలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి మన శరీరంలో రోగ నిరోధక శక్తిని పెంపొందించే వాటిలో పైనాపిల్ ఒకటి. పైనాపిల్ లో కేవలం రోగనిరోధకశక్తిని పెంపొందించే గుణాలు మాత్రమే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. మరి ఎన్నో ప్రయోజనాలు కలిగి ఉన్న ఈ పైనాపిల్ కూర ఏ విధంగా తయారు చేసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం.

కావలసిన పదార్థాలు:
పైనాపిల్ ఒకటి, ఒక కప్పు కొబ్బరి పొడి, ఆవాలు టేబుల్ స్పూన్,2 స్పూన్ల బెల్లం, తగినంత ఉప్పు, 2 ఎండుమిర్చి, కరివేపాకు రెమ్మ, తగినన్ని నీళ్లు, మూడు టేబుల్ స్పూన్ల నూనె.

తయారీ విధానం:
ముందుగా మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి కొబ్బరి తురుము, కొద్దిగా ఉప్పు, ఆ ఎండుమిర్చి, కొద్దిగా ఆవాలు, బెల్లం వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకుని కొన్ని నీళ్లు వేసి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ మిశ్రమంలో కి ముందుగా కట్ చేసి పెట్టుకొన్న పైనాపిల్ ముక్కలను వేసి బాగా కలియ బెట్టాలి.

ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి అందులోకి మూడు స్పూన్ల నూనె వేయాలి. నూనె వేడి అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, కరివేపాకు వేసి వేయించాలి. ఆవాలు చిటపట అన్న తర్వాత ఈ పోపును తీసుకొని ముందుగా తయారు చేసి పెట్టుకొన్న పైనాపిల్ మిశ్రమంలోకి వేస్తే ఎంతో రుచికరమైన పైనాపిల్ కూర తయారైనట్లే. ఈ పైనాపిల్ కూరను వేడి వేడి అన్నంలోకి లేదా ఉప్మా లోకి తింటే ఎంతో రుచికరంగా ఉంటుంది.